- పర్యావరణవేత్త మేధా పాట్కర్
- తెలంగాణ విద్యావంతుల వేదిక,పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఆన్ లైన్ సమావేశం
హైదరాబాద్,ఆగస్టు 2: నది జలాల విషయంలో కేంద్రం దగ్గర ఒక సమగ్రమైన విధానం లేదని,అన్ని లోపాలే వున్నాయని ప్రముఖ పర్యావరణవేత్త మేధాపాట్కర్ అన్నారు.ఆదివారం కృష్ణానది జలాల వివాదం-కేంద్ర గెజిట్ పర్యావసానాలు-తెలంగాణ భవిష్యత్ అనే అంశం పై తెలంగాణ విద్యావంతుల వేదిక, పాలమూరు అధ్యయన వేదిక అధ్వర్యంలో జరిగిన ఆన్లైన్ సమావేశం లో మేధాపాట్కర్ మాట్లాడుతూ
కృష్ణా నదీ జలాల వివాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నష్టం కలిగించేదే అన్నారు.తమ ఆజమాయిషీని, ఆధిపత్యాన్ని చాటుకొనుటకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్రీకృత చట్టాలను, గెజిట్ లను తీసుకొచ్చి రాష్ట్రాలకు ఉండే హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుందని..
2014 నుండి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను నిర్వీర్యం చేయుటకు, ఫెడరల్ స్ఫూర్తికి భంగం వాటిల్లే విధంగా విధానాలు కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్నదన్నారు.
ఈ గెజిట్ నోటిఫికేషన్ ను కూడా ఆ కోణంలోనే చూడాలన్నారు.ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ సమస్య పరిష్కారానికి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకుండా పరిష్కార మార్గాలు అన్వేషించాలన్నారు.క్రిష్ణా నదీ పరివాహక ప్రాంతం అత్యధికంగా 62% మహబూబ్ నగర్,నల్లగొండ ప్రాంతంలో ఉన్నదన్నారు. కాని ఈ ప్రాంతానికి న్యాయం జరగట్లేదన్నారు.ఈ గెజిట్ వల్ల సమస్య పరిష్కారం కాకపోగా జటిలం అవుతుందన్నారు.నదుల లాంటి సహజ వనరులు అక్కడ నివసించే ప్రజలకు ఉపయోగ పడాలి కాని డ్యాముల పేరుతో విధ్వంసానికి పాలకులు పాల్పడుతున్నారన్నారు.తెలంగాణ విద్యావంతుల వేదిక, పాలమూరు అధ్యయన వేదిక లాంటి సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం లోకి తీసుకొని ఇలాంటి సమస్యలు పరిష్కరించే మార్గాలు అన్వేషించాలి.ప్రభుత్వాలు చొరవ చూపకపోతే ఇరు రాష్ట్రాల్లో ఉన్న మేధావులు, నిపుణులతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలకు మార్గదర్శకం చేయాలి. ప్రజలను ఆ దిశగా సమాయత్తం చేయాల్సిన బాధ్యత కూడా ప్రజా సంఘాలు, మేధావుల పై ఉంటుంది.ఈ విషయంలో నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని మేధాపాట్కర్ అన్నారు.
జాతీయ ఉద్యమాల ఐక్య వేదిక మీకు బాసటగా ఉంటుంది అన్నారు.అంబటి నాగయ్య,రాఘవాచారి సమన్వయం చేయగా,వివిధ పార్టీ ల ,ప్రజా సంఘాల,హక్కుల సంఘాల నాయకులు హరగోపాల్, కోదండరామ్, మాడభూషి శ్రీధర్, జీవన్ కుమార్,కన్నెగంటి రవి,గోవర్థన్,రామ చంద్రన్,తిప్పర్తి యాదయ్య,రవీందర్ గౌడ్,సాజీ గోపాల్, రాజేంద్రబాబు,డి.ఎస్.ఎస్.క్రిష్ ణ,తిమ్మప్ప,జమీల్,పందుల సైదులు తదితరులు పాల్గొన్నారు.