పౌష్టకాహారంతో ఎముకలకు పటుత్వం

ఆధునిక సమాజంలో ఎన్నో వ్యాధులు మానవుల మనుగడకు ప్రశ్నార్థకంగా మారాయి.  బలవర్ధక మైన ఆహారం తీసుకోక పోవడంతో శరీరంలో శక్తి క్షీణించడమే కాకుండా, ఎముకల పటుత్వం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తు తున్నాయి. ముఖ్యంగా అస్టియో పొరోసిస్‌ (‌బోలు ఎముకలు) వ్యాధికి చాలా మంది గురవుతున్నారు. ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాల కారణంగా శరీరంలోని ఎముకలు పెళుసుగా మారి పలువురు ప్రమాదానికి లోనవు తున్నారు. ఎక్కువగా వృద్ధులకు వచ్చే ఈ వ్యాధి ప్రస్తుతం యువకుల్లోనూ కనిపిస్తున్నది. ప్రత్యేకించి మహిళల్లో ఈ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఒక్కోసారి ఈ వ్యాధి మరణానికి కూడా దారి తీస్తుంది. ఈ నేపథ్యంతో ఆస్టియో పొరోసిస్‌ ‌వ్యాధిపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆధునిక పనిముట్లు అందుబాటు లోకి రావటంతో శారీరక శ్రమ తగ్గింది. దీనికితోడు బలవర్థకమైన ఆహారం తీసుకునే పరిస్థితి లేదు. వ్యాధిపై అవగాహన లేక పోవడంతో వ్యాధిగ్రస్థుల సంఖ్య నానాటికీ  పెరుగు తున్నది. ఈ వ్యాధిపై ముందస్తు జాగ్రత్తలు లేకపోవడంతో కొందరు మంచానికే పరిమితం అవుతున్నారు. 80 శాతం మహిళలు, 20 శాతం పురుషుల్లో కనిపిస్తున్న ఈ బోలు వ్యాధి (ఆస్టియో పొరోసిస్‌) అం‌దరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో 50-60 ఏళ్లల్లో కనిపించే బోలు వ్యాధి ఇప్పుడు 30 ఏళ్ల వారిలోనూ ఉండటం గమనార్హం. వృద్ధుల్లో ప్రధాన సమస్యగా ఉన్న ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. చిన్నతనం నుంచి కాల్షియంతో కూడిన ఆహార పదార్ధాలు తరచుగా తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి ఉపశ మనం పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా మహిళల్లో వస్తుంది. 45 ఏళ్లు పైబడిన మహిళలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతున్నారు. విటమిన్‌ ‌డీ లోపం, కాల్షియం తక్కువగా తీసుకోవడం, రుతు స్రావం తొందరగా ఆగిపోవడం, జన్యు పరమైన కారణాలు, రోగ నిర్ధారణ నియమాలు లేకపోవడం, ఎముకల ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం వంటి కారణాల వల్ల మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. థైరాయిడ్‌ ‌కారణంగా కూడా దీని ప్రభావం ఎముకల సాంద్రతపై కూడా పడుతోంది. సూర్యరశ్మి తగలక పోవడం, జంక్‌ ‌ఫుడ్‌ అధికంగా తీసుకోవడం, విటమిన్‌ ‘‌డి’కొరత, స్టెరాయిడ్స్ ‌వాడటం తదితర కారణాలతో ఇది వస్తుంది.

సూర్యకాంతిలో గడిపే సమయం తక్కువగా ఉండడంతో మహిళలు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సాప్ట్‌వేర్‌ ‌రంగంలో పనిచేస్తున్న వారికి సూర్యరశ్మి తగలక పోవటం, ఏసీలోనే ఎక్కువ సేపు గడపటం వల్ల కూడా ఆస్టియో పొరోసిస్‌ ‌వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా గతంలో లాగా శారీరక శ్రమ తగ్గింది. ఇందువల్ల గ్రామీణ ప్రాంతాల వారు కూడా ఈ వ్యాధికి ఎక్కువగా గురవు తున్నారు. ఉదర సంబంధమైన వ్యాధులు ఉన్న వారిలో బోలు వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. సరైన పోషకాహారం తీసుకోక పోవడం, హైపో థైరాయి డిజం, హైపర్‌ ‌థైరాయిడిజం, చిన్న వయసులోనే గర్భసంచి ఆపరేషన్‌ ‌చేయించు కోవడం, కేన్సర్‌ ‌చికిత్సలో భాగంగా కీమోథెరపి చేయించడం, బక్కపలుచగా ఉండటం, శారీరక శ్రమ లేక పోవడం, రొమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్న వారిలోనూ బోలు వ్యాధి కనిపిస్తుంది. బోలు వ్యాధి ఉంటే తుంటి ఎముక, వెన్నుపూస, మణికట్టులు చిన్నచిన్న దెబ్బలకే విరిగి పోతుంటాయి. గతుకుల రోడ్లలో వేగంగా వెళ్లడం, సడన్‌గా బ్రేక్‌ ‌వేసినప్పుడు ఎముకలు విరిగి పోతుంటాయి. బోలు ఎముకలు వల్ల తీవ్రంగా నీరసం వస్తుంది. విరిగిన వెన్నుపూస, ఎముకల వల్ల తీవ్ర నొప్పి, పెరుగుదల తగ్గడం, శరీరం వంగిపోవడం, నడవలేని పరిస్థితి, మనిషి కదలిక మందగించడం తదితరాలు. ఎముకల పటిష్టతకు కాల్షియం ఉండే ఆహార పదార్ధాలతో పాటు మీగడ తీసిన పాలు, జున్ను తీసుకుంటే ఎంతో మేలు. ఉడక బెట్టిన బచ్చలికూర, బీన్స్, ‌పచ్చి క్యాబేజీ, పచ్చి క్యారెట్‌, ఉడకబెట్టిన క్యాలీఫ్లవర్‌ ‌తీసు కోవాలి. ఉడకబెట్టిన బెండ, బటానీలు, సోయాబీన్స్, ఉడక బెట్టిన పాలకూర, స్వీట్‌ ‌పొటాటో తరచూ తీసుకోవాలి. ఖర్జూరం, కమలాలు, బొప్పాయి, బ్లాక్‌ ‌బెర్రీలు తరచూ తీసుకోవాలి. బాదం పప్పు, ఎండబెట్టిన నువ్వులు, గుడ్లు తీసుకుంటే ఎముకల పటిష్టత పెరుగుతుంది.

ప్రధానంగా జీవనశైలిలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి. వ్యాధిపై అవగాహన పెంచుకుని జాగ్రత్త పడాలి. వ్యాధికి గురి కాకుండా మంచి పౌష్టికా హారాన్ని తీసుకోవాలి. యువతీ యువకులు మద్యపానం, ధూమ పానానికి దూరంగా ఉండాలి. తక్కువ కొవ్వు పదార్ధాలు ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. వ్యాధిగ్రస్థులు దృఢమైన ఎముకల కోసం, పగుళ్ల నివారణ కోసం కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. తృణ ధాన్యాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఎముకల సాంద్రత తగ్గిపోవడాన్ని నివారించే మందులు ప్రస్తుతం ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఈస్ట్రోజన్‌, ‌హార్మోన్‌ ‌చికిత్సలు కూడా ప్రస్తుతం అందుబాటు లోకి వచ్చాయి. ఇంజక్షన్లతో పాటు మందులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 45 ఏళ్లపైబడ్డ వారు తప్పని సరిగా ఎముకల పరీక్ష చేయించు కోవాలి. చిన్నతనం నుంచే కాల్షియంతో కూడిన ఆహార పదార్ధాలు తీసుకుంటే భవిష్యత్తులో సమస్యలు రావు. ఆహార నియమాలు తప్పని సరిగా పాటించాలి. వ్యాధిపై నిర్లక్ష్యం వద్దు. వ్యాధిపై అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు ఎముకల పటుత్వ పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని త్వరగా గుర్తించి, చికిత్స చేయించు కోవాలి.
 – రామ కిష్టయ్య సంగన భట్ల…
    9440595494

Bone strength with nutritionprajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment