- చంద్రబాబు మెడకు అమరావతి భూముల వ్యవహారం
- చంద్రబాబు, మాజీమంత్రి నారాయణలకు నోటీసులు
- సిఐడి కేసు నమోదు.. 23న విచారణకు రావాల్సిందే ఆదేశాలు
ఇప్పటికే ఆంధప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన టిడిపికి మరో షాక్ తగిలింది. దాని నుంచి తేరుకోక ముందే హైదరాబాద్లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నివాసానికి ఎపి సిఐడి అధికారులు వెళ్లి నోటీసులు జారీ చేశారు. అమరావతిలో భూముల కొనుగోలు, అమ్మకాల వ్యవహారంపై 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చినట్లు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. చంద్రబాబుపై 120బి, 166,167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు.
500 ఎకరాల అసైన్డ్ భూముల బదలాయింపు, కేబినెట్ ఆమోదం లేకుండానే భూములను ల్యాండ్పూలింగ్లో చేర్చడంపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సరిగ్గా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజులకు ఈ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమరావతి భూ కుంభకోణం కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు చంద్రబాబు నాయుడుకి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి దీనికి సంబంధించిన నోటీసులను అందజేశారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే ఐపీసీ సెక్షన్లు 120 బీ, 166, 167, 217, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ అలినేషన్ యాక్ట్ 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు అయ్యాయి. కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ భూములను ల్యాండ్పూలింగ్లో చేర్చడానికి జీవో ఇచ్చారని ప్రధాన అభియోగం మోపారు సీఐడీ అధికారులు.
వాస్తవంగా దళితులకు కేటాయించిన ఈ భూములను రాజధాని ప్రకటనకు ముందు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ అసైన్డ్ భూముల కొనుగోళ్లను వన్టైమ్ సెటిల్మెంట్లో క్రమబద్దీకరణ చేయడానికి అనుమతించారు. ఈ క్రమంలో అధికారుల అభ్యంతరాలను, సూచనలను పట్టించుకోకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. విజయవాడ నుంచి ఉదయం 8 గంటలకు రెండు బృందాలుగా హైదరాబాద్ వచ్చిన సీఐడీ అధికారులు జూబ్లీహిల్స్ లోని బాబు నివాసానికి వెళ్లి నోటీసులిచ్చారు. దీనిపై అటు చంద్రబాబు కానీ.. ఇటు నారాయణ కానీ ఇంతవరకూ స్పందించలేదు. కాగా.. టీడీపీ హయాంలో నారాయణ పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే.
రాజధాని ప్రకటనకు ముందే తన అనుచరులకు సమాచారం ఇచ్చి అక్కడ దళితులకు చెందిన అసైన్డు భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలతో కేసు నమోదు అయినట్లు సమాచారం. అసైన్డ్ రైతులను మోసం చేసి తన అనుచరులకు లబ్ది కలిగించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై హైకోర్టులో కూడా విచారణ జరిగింది. ఈ విషయంలో చంద్రబాబుకు సంబంధం లేదంటూ న్యాయస్థానం చెప్పింది. కాగా.. రాజధాని ప్రకటన తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయని.. అసైన్డ్ రైతులు మోసపోయి.. అనుచరులకు లబ్ది కలిగించారని కేసు నమోదు చేయడం జరిగింది. మరోవైపు టీడీపీ నేతలు వి•డియా ముందుకొచ్చి ఈ నోటీసుల వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.