పట్టాభిషిక్తుడైన భదాద్రి రామయ్య
భద్రాచలంలోని కల్యాణ రామునికి గురువారం నాడు శ్రీరామమహాపట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. కొరోనా ప్రభావం కారణంగా బుధవారం నాడు స్వామివారి కల్యాణం జరిగిన నిత్యకల్యాణం ప్రాంగణంలో నే గురువారం స్వామివారి మహాపట్టాభిషేకం జరిగింది. పట్టాభిషిక్తుడైన శ్రీరామునికి స్వర్ణ కిరీటధారణ గావించారు. నిత్యకల్యాణం మండపం నందు శ్రీరామ మహా పట్టాభిషేకం వేడుక కన్నుల పండుగగా సాగింది. స్వామివారికి కల్యాణ తంతును భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించగా గురువారం పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపారు. ముందుగా శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మూర్తులను అందంగా అలంకరించిన పల్లకిలో మంగళవాయిథ్యాలు, మేళతాలాలతో మండపం వేదిక వద్దకు తీసుకువచ్చారు. ముందుగా విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కళవాహన, మండపారాధన నిర్వహించారు. అదే విధంగా అష్టదిక్పాలకులకు, త్రిమూర్తులను ఆవాహన చేశారు. అనంతరం శ్రీరామపట్టాభిషేక మంత్ర సంపుటిత అష్టోత్తర శత నామార్చన వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామపట్టాభిషేక విశిష్టతనుఆలయ అచర్చకులు వివరించారు. అభిజిత్ లగ్నంలో సమస్త నదీజలాలతో ప్రోక్షణ నిర్వహించారు. అదే విధంగా వేదపండితుల వేదమంత్రాల మధ్య రామయ్యకు లాంచనాల్లో భాగంగా స్వామివారి పట్టాభిషేక ఆభరణాలను ఒక్కొక్కటి భక్తులకు చూపిస్తూ అలంకరించారు. ముందుగా శ్రీరామపాదుకలు, రాజదండం, రాజముద్రిక, స్వర్ణచత్రం, చామరం స్వామివారికి సమర్పించారు.