“ఇటువంటి సాక్షులను హాజరుపరిచి, వాళ్ల వాంగ్మూలాల ద్వారా రమీజాబీ వేశ్య అని రుజువు చేయడానికి ప్రయత్నించారు పోలీసులు. నిజానికి అది అసలు విషయమే కాదు. ఆమె వేశ్యనా కాదా అనే విషయానికీ, అక్కడ జరుగుతున్న విచారణకూ ఏమీ సంబంధం లేదు. ఇది పక్కదారి పట్టించే ఎత్తుగడ అని కొందరు అనుకుంటారు. అది నిజానికి ఒక మూర్ఖపు ఎత్తుగడ. తెలివి తక్కువ ఎత్తుగడ. అది ఎందుకూ పనికిరాని తెలివి మాలినతనం అని నేననుకుంటాను.”
సమస్య ఏమంటే, ఈ దేశంలో నేరస్తులను విచారించడంలో ప్రజలకు గాని న్యాయ వ్యవస్థకుగాని సహకరించవలసిన సంస్థలన్నీ పూర్తిగా నేరస్తులకే సహాయపడుతున్నాయి . అవి నేరస్తులతో చేతులు కలుపుతున్నాయి . ఒక వేళ నేరస్తుడు పోలీసు అధికారి అంతే ఇక పోలీసు వ్యవస్థ తన అసలు పని అయిన నేర విచారణ చేసే బదులు ఆ పోలీసు అధికారిని ఆ నేరం నుంచి తప్పించడం ఎట్లా అని సకల ప్రయత్నాలు చేస్తుంది. ఏయే సాక్ష్యాధారాలను మార్చడం ద్వారా, తారుమారు చేయడం ద్వారా నేరస్తుడైన పోలీసు అధికారిని రక్షించవచ్చునా అని ఫోరెన్సిక్ శాఖ ఆలోచిస్తుంది. రమీజాబీ ` అహ్మద్ హుస్సేన్ కేసులో ఖండేల్కర్ చేసిన పని కూడా అదే. నాగరాజ్ అని ఒక వైద్యుడు శవపరీక్ష చేశాడు. క్రాస్ ఎగ్జామినేషన్లో ఎంత తొట్రు పడ్డాడంటే కమిషన్ ఆయన ప్రవర్తన మీద చివాట్లు పెడుతూ వ్యాఖ్యలు కూడా చేసింది. ఆయనను మందలించింది.
రమణారెడ్డి అని కాచిగూడ పోలీసుస్టేషన్ల ఒక సర్కిల్ ఇనస్పెక్టర్ ఉండేవాడు. ఆయన విచారణ క్రమంలో ఒక విచిత్రమైన ప్రకటన చేశాడు. నేను చాలా మామూలుగా ఒక ప్రశ్న వేస్తే దానికి జవాబు ఇస్తూ పోలీసు స్టేషన్లలో నిర్వహించే జనరల్డైరీలను ప్రైవేటు ప్రచురణకర్తలు అచ్చువేస్తారని ఆయన అన్నాడు. ఆ డైరీ మీద ప్రభుత్వ చిహ్నం ఉంటుంది. పోలీసులకు, శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించినంతకు ఈ జనరల్ డైరీ అనేది చాలా ముఖ్యమైనది. నేరాల గురించి పోలీసులకు తెలిసినది తెలిసినట్టుగా నమోదు చేసే ఖాతా పుస్తకం లాంటిది అది. దానితో వరుసగా నేరాలను నమోదు చేయవలసిందే తప్ప ముందు వెనుకలు చేయడాఇకి వీలు లేదు. ఆ డైరీని ప్రభుత్వమే భద్రతతో అచ్చువేసి పోలీసు అధికారులకు అందజేస్తుంది. కాని అది బయట మార్కెట్లో కొనుక్కుంటే దొరుకుతుందని, దాన్ని ప్రైవేటు ప్రచురణ కర్తలు అచ్చు వేస్తారని ఆయన అన్నాడు.
ఆ విచారణ క్రమంలో మొత్తంగా ప్రభుత్వ, పోలీసు సాక్షులందరూ కూడా చెప్పడానికి ప్రయత్నించిందేమంటే రమీజాబీ ఒక వేశ్య అని. నా వాదన ఏమంటే ఆమె వేశ్య అయినా కూడా ఆమెతో, ఆమె భర్తతో ఈ విధంగా ప్రవర్తించడానికి పోలీసులకు హక్కులేదు అని.ఆ కమిషన్ విచారణలో ఇంకొక విచిత్రమైన విషయం జరిగింది. అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోకి వచ్చే తార్పుడుగాళ్లను, బ్రోకర్లను వ్యభిచారులను తీసుకొచ్చి పోలీసులు సాక్ష్యాలు చెప్పించారు. వాళ్లందరు కూడా ఏకకంఠంతో రమీజాబీ వేశ్య అని చెప్పడానికి ప్రయత్నించారు. ఇది గుర్తు చేసుకుంటుంటే, ఒక హాస్యాస్పదమైన సంగతి గుర్తుకు వస్తోంది. అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధి నుంచి ఒక తార్పుడుగాడిని తీసుకొచ్చారు. అతడి వాంగ్మూలం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది.
అతడిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ మీ వృత్తి ఏమిటి (‘‘ఆప్కా దందా క్యా హై’’) అని నేనడిగాను. ‘‘దందా కర్తాహు సాబ్’’ (వ్యాపారం చేస్తాను సార్ అన్నాడతను. అంటే స్త్రీలను వేశ్యావృత్తిలోకి దించడం అన్నమాట. అటువంటి వాడు మన పోలీసులు ప్రవేశపెట్టిన ‘‘గౌరవనీయ సాక్షి’’ ‘‘హమారా కస్టమర్స్ బడే బడే ఆఫ్సర్ లోగ్ హై సాబ్ అన్నాడతను. ఆ మాట బహిరంగంగా, నిస్సిగ్గుగా చెప్పాడు. ‘‘పోలీసు అధికారులు కూడా వస్తారా’’ అని నేనడిగాను. ‘‘హా ఆతే సాబ్, బడే బడే పోలీస్ ఆఫ్సర్స్ ఆతే సాబ్’’ అన్నాడతను. అప్పుడు ముక్తధర్, ‘‘కన్నబిరాన్, ఆస్క్ హిమ్ వెదర్ ఐ వాజ్ హిజ్ కస్టమర్ ఎట్ ఎనీ టైమ్’’ అన్నాడు నవ్వుతూ. ఆయన చాలా మృదుస్వభావి, చాలా హాస్యప్రియుడు చాలా మంచి వ్యక్తి. ఇటువంటి సాక్షులను హాజరుపరిచి, వాళ్ల వాంగ్మూలాల ద్వారా రమీజాబీ వేశ్య అని రుజువు చేయడానికి ప్రయత్నించారు పోలీసులు. నిజానికి అది అసలు విషయమే కాదు. ఆమె వేశ్యనా కాదా అనే విషయానికీ, అక్కడ జరుగుతున్న విచారణకూ ఏమీ సంబంధం లేదు. ఇది పక్కదారి పట్టించే ఎత్తుగడ అని కొందరు అనుకుంటారు. అది నిజానికి ఒక మూర్ఖపు ఎత్తుగడ. తెలివి తక్కువ ఎత్తుగడ. అది ఎందుకూ పనికిరాని తెలివి మాలినతనం అని నేననుకుంటాను.
సుఖా, జిందాల సంగతే తీసుకోండి. వాళ్లను టెర్రరిస్టులుగా అభివర్ణించారు. టెర్రరిస్టులంటే నీతిలేని వాళ్లు అని చూపాలని పోలీసుల ఉద్దేశ్యం. అందుకే వాళ్లు తాగుబోతులనీ, తిరుగుబోతులనీ చూపడానికి చాలా ప్రయత్నం చేశారు. నిజానికి చర్చలో ఉన్న విషయానికీ, ఈ అభివర్ణనకూ సంబంధమే లేదు. పోలీసులు ఎవరినైనా చంపినప్పుడు ఎందుకు చంపారు అని అడిగితే ‘‘వాడురౌెడీ సార్ అంటారు. రౌడీ అంతే చంపవచ్చునా అనే ప్రశ్న రాదనీ రాకూడదనీ వాళ్ల ఉద్దేశ్యం.
ఆ విచారణ అయిపోయాక ముక్తధర్ ఒక మంచి నివేదిక ఇచ్చాడు. కాని విషాదం ఏమంటే, ఆ నివేదికను శాసనసభలో సమర్పించినప్పటికీ దాని వల్ల ఏమీ జరగలేదు. సుందర్ సింగ్ అనే పోలీసు అధికారి మీద కోర్టులో విచారణ మొదలైంది. ఆ కేసును రాయచూరు జిల్లా సెషన్స్ దగ్గరికి బదిలీ చేశారు. ఆ కేసులో శ్రీపతి రావు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, సీతాపతి నిందితుడి తరఫు న్యాయవాదిగా పని చేశారు. వాళ్లు రాయచూరుకు వెళ్లివచ్చేవారు. వాళ్లందరూ కలిసి నాగార్జునసాగర్కు వెళ్లివిందు చేసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి . మొత్తానికి నిందితుడి మీద నేరనిర్థారణ జరగలేదని నిర్దోషిగా విడుదల చేయడం జరిగింది. కేసుకొట్టి వేయడం జరిగింది. అంటే, విచారణ కమిషన్ తన విచారణ క్రమంలో సేకరించిన సాక్ష్యాధారాలన్నీ ఎందుకూ పనికి రాకుండా పోయాంయి , అపహాస్యమైపోయాయి . నిందితులు వదిలిపెట్టబడ్డారు. ఒక రోజు నేను దిల్లీ వెళుతుండగా, విమానాశ్రయంలో ఒక పోలీసు ఇనస్పెక్టర్ నాకు సెల్యూట్ చేశాడు. ఎవరా అని నేను చూస్తుండగా, ‘‘క్యా సాబ్ మై యాద్ నహీ హై ఆప్ కో, ఆప్ మేరే ఖిలాఫ్ లడేథేనా, సాబ్, వోయి రమీజాబీ కీ కేస్ మే, మై సుందర్సింగ్, అక్విట్ హోగయా సాబ్’’ అన్నాడు..
-కె.జి. కన్నబిరాన్
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం