- అవసరమైతే మళ్లీ లాక్డౌన్ తప్పదన్న మహా సిఎం
- దేశంలో పెరుగుతున్న కొరోనా కేసులు
దేశవ్యాప్తంగా కొరోనా మహమ్మారి ఉగ్రరూపాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం దేశంలో గతేడాది అక్టోబర్ నాటి విజృంభణ కనిపిస్తుంది. సగం కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. అవసరైతే లాక్డౌన్ తప్పదని మహా సిఎం ఉద్దవ్ థాక్రే హెచ్చరించారు. తాజాగా 9,13,319 కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. 68,020 కొత్త కేసులు వెలుగుచూశాయి. 291 మంది ప్రాణాలు వదిలారు. మొత్తంగా కొరోనా సోకిన వారి సంఖ్య కోటీ 20లక్షల మార్కును దాటింది. ఆదివారం వరకు 1,61,843 మంది ప్రాణాలు కోల్పోయారని సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక, పాజిటివ్ కేసుల్లో పెరుగుదల మూలంగా కొవిడ్తో బాధపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య ఐదు లక్షల మార్కును దాటేసింది. ఆ రేటు నాలుగు శాతం దాటింది. మరోవైపు, నిన్న 32,231 మంది కొరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మిద కోటి 13లక్షల పైచిలుకు మంది వైరస్ను జయించగా..రికవరీ రేటు 94.59 శాతానికి పడిపోయింది. కొరోనా వైరస్ టీకాల విషయానికొస్తే.. మార్చి 28న కేవలం 2,60,653 మందికి మాత్రమే టీకా డోసులు అందాయి.
ఇప్పటివరకు టీకా వేయించుకున్నవారి సంఖ్య 6,05,30,435కి చేరింది. మహారాష్ట్రలో కొరోనా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే..లాక్డౌన్ను ఎలా విధించాలో కార్యచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.