ఉస్మానియా ముందు విగ్రహం పెట్టాలి
విగ్రహావిష్కరణలో పిసిసి చీఫ్ రేవంత్ సహా నేతల డిమాండ్
మహబూబ్నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : హైదరాబాద్ మెట్రో రైల్కు జైపాల్రెడ్డి పేరు పెట్టే బాధ్యత తమదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. దివంగత కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని జైపాల్రెడ్డి స్వగ్రామమైన మాడ్గులలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..హైదరాబాద్లో ఉన్న మెట్రో శ్రమ అంతా జైపాల్రెడ్డిదే అని పేర్కొన్నారు. మెట్రోరైల్తో హైదరాబాద్ కీర్తి ప్రపంచ వ్యాప్తంగా మరింత పెరిగింది. పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హైదరాబాద్లో మెట్రో కోసం కృషిచేశారు. మెట్రోకు అనుమతులు తెచ్చి రూ.1500కోట్ల మంజూరు చేశారు. 12 నెలల తర్వాత మెట్రోకు జైపాల్రెడ్డి పేరు పెట్టి చూపిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
ఏ సిద్ధాంతాలు, విలువలతో జైపాల్రెడ్డి ముందుకు సాగారో…అవి ప్రస్తుత రాజకీయాల్లో లోపించాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కాగా సీతారాం ఏచూరి, రేవంత్రెడ్డి దివంగత నేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘విద్యార్థి దశలో జైపాల్రెడ్డి, నేను మొదటిసారిగా కలుసుకున్నాం. జైపాల్రెడ్డి విగ్రహం ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నా. 3 దశాబ్దాలు రాజకీయాల్లో ఇద్దరం కలిసి పనిచేశాం. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు లోపించాయి. చివరి వరకు విలువలకు కట్టుబడిన నాయకుడు జైపాల్రెడ్డి.
దేశంలో 4 స్తంభాలపై చాలా దాడులు జరుగుతున్నాయి’ అని సీతారాం ఏచూరి అన్నారు. జైపాల్రెడ్డి ఒక గొప్ప రాజకీయవేత్త. జైపాల్రెడ్డి విగ్రహం చూడగానే యువతకు ఆయన స్ఫూర్తి గుర్తుకు రావాలి. జైపాల్రెడ్డి నియమావళి అందరికీ ఆచరణీయమని జస్టిస్ సుభాష్రెడ్డి పేర్కొన్నారు. గ్రామంలో శిలాఫలకంతో పాటు జైపాల్రెడ్డి జీవితచరిత్ర బ్రోచర్ను జస్టిస్ సుభాష్రెడ్డి విడుదల చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ముందు జైపాల్రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తీర్మానించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్న నేతలు… చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు ఆర్..కృష్ణయ్య, సుప్రీమ్ కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాష్రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, భాజపా నేత ఆచారితో పాటు పెద్దసంఖ్యలో నేతలు హాజరయ్యారు. రాజకీయ పార్టీల ప్రముఖ నేతల రాకతో పాటు అభిమాన నాయకుడి విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన అభిమానులు, వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.