తెరిపించేందుకు కేంద్రంపై ఒత్తిడి
సిమెంట్ కంపెనీ పునఃప్రారంభానికి అని ప్రయత్నాలు చేస్తున్నాం
ఆదిలాబాద్ నేతలతో మంత్రి కెటిఆర్
ప్రజాతంత్ర, హైదరాబాద్, జనవరి 26 : సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ కోసం కేంద్రం పైన ఒత్తిడి తీసుకు వొస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. కేంద్రంపైన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరింత ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ అన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అప్పనంగా అమ్మేవేసేందుకు కుట్ర చేస్తుందని మంత్రి ఆరోపించారు. ఆదిలాబాద్కు చెందిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు ఆదిలాబాద్ యువకులు, జిల్లాలోని ఇతర ప్రముఖులు బుధవారం మంత్రి కేటీఆర్ ను ప్రగతిభవన్లో కలిసి కంపెనీ పున ప్రారంభం చేపట్టాల్సిన ఆందోళన కార్యాచరణపై చర్చించారు. కంపెనీ పునః ప్రారంభం కోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నామని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మేరకు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరిన విషయాన్ని ఈ సందర్భంగా తెలిపారు. సీసీఐ పున ప్రారంభానికి అవసరమైన అన్ని రకాల ప్రత్యేక రాయితీలను ఇస్తామని, కొత్త కంపెనీని ఏర్పాటు చేస్తే ఎలాంటి రాయితీలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుతాయో వాటిని సీసీఐకి అందించేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.
ఒకవైపు ఉమ్మడి ఆదిలాబాద్లో అనేక పరిశ్రమలను స్థాపించి జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పన కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. సీసీఐ పునరుద్ధరణ చేయాలని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులను స్వయంగా కలిశామని, అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశామని ఆయన గుర్తుచేశారు. అయితే, ఇప్పటిదాకా కేంద్రం నుంచి దీనిపై ఎలాంటి సానుకూల స్పందన లేదన్నారు. ఇప్పటికే ఆదిలాబాద్లోని సిర్పూర్ పేపర్ మిల్లుని ప్రారంభించిన చరిత్ర, నిబద్ధత టీఆర్ఎస్ పార్టీకి వుందన్నారు. మరోవైపు జిల్లాకు సిరుల వరప్రదాయిని అయిన సింగరేణిని క్రమంగా ప్రైవేటీకరించే ప్రయత్నాలకు కేంద్రం తెరలేపిందని కేటీఆర్ అన్నారు. సీసీఐ విషయంలో అవసరమైతే అదిలాబాద్ యువత ప్రయోజనాల కోసం ఢిల్లీకి సైతం వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామన్నారు. త్వరలోనే ఆదిలాబాద్కు ఐటీ టవర్ను మంజూరు చేస్తామని, దీంతో పాటు టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను సైతం సిద్ధం చేయాలని అధికారులను కోరినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సాధన సమితిగా ఏర్పడి ఉద్యమిద్దామని తెలిపారు. ఈ విషయంలో ఆదిలాబాద్కి చెందిన బీజేపీ ఎంపీని కేంద్ర ప్రభుత్వం పైన సీసీఐ పునరుద్ధరణ కోసం ఒత్తిడి తీసుకురావాలని నిలదీస్తామన్నారు. సీసీఐ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేయడం పట్ల ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ జిల్లా ప్రజల పట్ల ధన్యవాదాలు తెలిపారు.