- కార్పొరేట్లకు మేలు కలిగేలా చర్యలు
- బ్యారెల్ ధరలు తగ్గినా తగ్గని పెట్రో ధరలు
- బిజెపిని వొదిలించుకుంటేనే ధరాఘాతం నుంచి విముక్తి
- మంత్రి కెటిఆర్ ఫైర్…కేంద్రానికి బహిరంగ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30 : పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా దోచుకుంటుందన్నారు. ఈ దోపిడీకి అంతర్జాతీయ ముడిచమురు ధరలను బూచిగా చూపించి కేంద్రం ఇంతకాలం చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందని, పెట్రో ధరల దోపిడీపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయని, ప్రతిపక్ష పార్టీలు సైతం కేంద్రంపై విమర్శలు గుప్పించాయన్నారు. ఇక తాజాగా పెట్రో దోపిడీపై కేంద్రానికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. 2013లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లు ఉన్నప్పుడు, దేశంలో లీటర్ పెట్రోల్ రేటు కేవలం 76 రూపాయలేనని, కానీ నేడు బ్యారెల్ ముడిచమురు రేటు దాదాపు సగం పడిపోయినా.. అంటే 66 డాలర్లకు తగ్గినా, ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ కు 110 రూపాయలు ఉండడమే ఇందుకు నిదర్శనమన్నారు మంత్రి కెటిఆర్.
అందుకే దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని, మోదీ నిర్ణయించిన చమురు ధరలేనని మనం గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైందన్నారు. కేవలం ముడి చమురును ఒక బూచిగా చూపించి తన కార్పొరేట్ మిత్రుల ఖజానాను లాభాలతో నింపేందుకు మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురులు ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా దేశంలో పెట్రోల్ ధరను అమాంతం పెంచుకుంటూ పోతుందని కెటిఆర్ మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, 2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 45శాతం పైగా పెట్రో ధరల పెంపు వల్ల సరుకు రవాణా భారమై, సామాన్యుడు కొనుగోలు చేసే ప్రతి సరుకు ధర భారీగా పెరిగిందని, నిత్యావసర వస్తువులు, కూరగాయల నుంచి మొదలుకొని పప్పు ఉప్పు వరకు అన్ని రకాల ప్రాథమిక అవసరాల ధరలు ఆకాశాన్ని తాకాయన్నారు. భారీగా పెరిగిన డీజిల్ ధరల వలన ప్రజా రవాణా వ్యవస్థ సంక్షోభం అంచుకి చేరుతుందని, దీంతో అన్ని రాష్ట్రాల్లో ప్రజా రవాణా చార్జీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సృష్టించిందన్నారు.
అలాగే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల గత 45 ఏళ్లలో ఎప్పుడు లేనంత ద్రవ్యోల్బణం దేశాన్ని పట్టిపీడిస్తుందని వివరించారు. ఇన్నాళ్లు అంతర్జాతీయ ముడి చమురు ధరల ప్రస్తావన లేదా ఉక్రెయిన్- రష్యా యుద్ధం పేరు చెప్పి దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని మోదీ ప్రభుత్వం చేసింది. కానీ ఒకవైపు రష్యా నుంచి అత్యంత తక్కువ ధరకు చమురు దేశానికి భారీగా దిగుమతి చేసుకుంటున్నామని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, మరోవైపు తక్కువ ధరకు ముడిచమురు అందుబాటులో ఉన్నా, ప్రజల జేబుల నుంచి పెట్రోల్ ధరల పేరుతో చేస్తున్న దోపిడీకి మాత్రం సమాధానం చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న 35 వేల కోట్ల రూపాయల ముడిచమురు పొదుపు ప్రయోజనమంతా కేవలం ఒకటి రెండు ఆయిల్ కంపెనీలకే దక్కిందన్నది వాస్తవం. దేశీయ వినియోగం పేరు చెప్పి భారీగా రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడిచమురును, శుద్ధి చేసి తిరిగి విదేశాలకు అమ్ముకుంటున్న కీలకమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పకుండా దాచి ఉంచుతుందన్నారు. తక్కువ ధరకు ముడి చమురును కొని తిరిగి విదేశాలకే పెట్రోలు అమ్ముతున్న కంపెనీలకు వచ్చిన అడ్డగోలు లాభాలను దృష్టిలో పెట్టుకుని, దానిపై ప్రభుత్వానికి వొచ్చే విండ్ ఫాల్ పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విషయాన్ని గమనించాలన్నారు.
కార్పొరేట్ కంపెనీలకు పన్నులు తగ్గించినప్పటికీ.. దేశ ప్రజల పట్ల మాత్రం పెట్రోల్ పేరుతో దోపిడీని కొనసాగిస్తున్న కఠినాత్ముడు ప్రధానమంత్రి మోదీ అని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరుతున్నానని కెటిఆర్ అన్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 2013 లో ఉన్న స్థాయికి పడిపోయిన నేపథ్యంలో భారీగా పెంచినందున పెట్రోల్ రేటును తగ్గించాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి మోదీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశ ప్రజల నుంచి పెట్రోల్ ధరల రూపంలో చేస్తున్న దోపిడీని ఆపాలని డిమాండ్ చేస్తున్నాను. మరోవైపు తెలంగాణ లాంటి రాష్ట్రాలు 2014 నుంచి ఒక్క రూపాయి వ్యాట్ను పెంచకున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం సెస్సుల పేరుతో 30 లక్షల కోట్లకు పైగా ప్రజల నుంచి కొల్లగొట్టిందన్నారు. కానీ ఈ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైకి నెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తుందన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధర 70 డాలర్ల లోపు చేరిన నేపథ్యంలో ఆ మేరకు పెట్రోల్ రేటును తగ్గించేందుకు కేంద్రం విధించిన సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలన్నారు.
పెట్రోల్ ధరలు తగ్గాలంటే దాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వంలోని బాధ్యత కలిగిన మంత్రులు చెప్పడం గురువింద సామెతను తలపిస్తుందని, జీఎస్టీ పరిధిలో ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధరను 400 రూపాయల నుంచి 1200 కు పెంచిన అసమర్థ కేంద్ర ప్రభుత్వం దిల్లీలో ఉందని దుయ్యబట్టారు. ప్రపంచంలోనే అత్యధికంగా గ్యాస్ సిలిండర్ ధర పెంచిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలకు కల్లబొల్లి కబుర్లు చెప్పడం అర్ధరహితమని, ఇప్పటికే జీఎస్టీ పరిధిలో ఉన్న సిలిండర్ ధరలను కేంద్రం ఎందుకు తగ్గించలేకపోయిందో ముందు సమాధానం చెప్పాలన్నారు. ఇకపోతే ధరల పెరుగుదల అంశం పార్లమెంటులో చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంవని, అయితే దేశ ప్రజలు మోదీ ప్రభుత్వం చేస్తున్న ఈ పెట్రో దోపిడీని గమనిస్తున్నారన్నారు. పెరిగిన పెట్రోల ధరల తాలూకు దుష్పరిణామాలను వారు అనుభవిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వమే ఒక దోపిడీదారుగా మారి ప్రజల జేబులో నుంచి దోచుకుంటున్న పెట్రో భారం తగ్గాలంటే, భారతీయ జనతా పార్టీని వదిలించుకోవడమే ఏకైక మార్గమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ దోపిడీని ఆపాలని, లేకుంటే ప్రజల చేతిలో కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని మంత్రి కెటిఆర్ హెచ్చరించారు.