- 2013తో పోలిస్తే రెట్టింపు
- ప్రపంచ వ్యాప్తంగా 50 శాతం టీకాలు తెలంగాణలోనే ఉత్పత్తి
- సిఐఐ సదస్సులో మంత్రి కెటిఆర్
- మళ్లీ అధికారం తమదేనన్న మంత్రి
- లైఫ్ సైన్సెస్ ఫెలోషిప్ కోసం దరఖాస్తులకు ఆహ్వానం : ట్వీట్ చేసిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7 : వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇటీవల బయో ఏషియా సదస్సు విజయవంతంగా నిర్వహించుకున్నామని తెలిపారు. వొచ్చే ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వొస్తామని.. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. బేగంపేటలో ఏర్పాటు చేసిన సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు రాష్ట్రంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాప్ట్, అడోబ్ వంటి సంస్థలు హైదరాబాద్లో అతిపెద్ద ప్రాంగణాలు నెలకొల్పాయని.. 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపయ్యాయన్నారు. 2030 నాటికి 250 బిలియన్ డాలర్లు సాధించాలనే లక్ష్యంతో ఉన్నామన్న కేటీఆర్..లైఫ్సైన్స్తో పాటు టెక్నాలజీ రంగానికి హైదరాబాద్ అత్యుత్తమ వేదికగా మారిందని వ్యాఖ్యానించారు.
9 బిలియన్ టీకాలు హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తయ్యే టీకాల్లో 50 శాతం హైదరాబాద్లోనే తయారవుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రం మన డివైజెస్ పార్కులోనే ఉందన్నారు. తెలంగాణలో అతి పెద్ద మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశామని, దేశానికే హైదరాబాద్ మొబిలిటీ కేంద్రంగా మారుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంగళవారం కాకతీయ హోటల్లో జరిగిన 2022-23 సీఐఐ రాష్ట్ర వార్షిక సమావేశంలో మంత్రి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందని తెలిపారు. ఇటీవల బయో ఏషియా సదస్సు విజయవంతంగా నిర్వహించుకున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరానికి ఎన్నో అనుకూలతలు, బలాలు ఉన్నాయన్నారు. ప్రపంచంలో అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రం మన డివైజెస్ పార్కు తెలంగాణలో ఉందని అన్నారు.
దేశానికే హైదరాబాద్ మొబిలిటీ కేంద్రంగా మారుతోందన్నారు. లైఫ్ సైన్సెస్తో పాటు టెక్నాలజీ రంగానికి హైదరాబాద్ అత్యుత్తమ వేదికగా మారిందని సదస్సులో తెలిపారు. ప్రైవేటు రంగంలో ఉపగ్రహాల తయారీ మొట్టమొదటగా హైదరాబాద్లోనే జరిగిందని గుర్తుచేశారు. డ్రోన్ల ద్వారా ఔషధాలు సరఫరా చేసే వినూత్న కార్యక్రమం చేపట్టామన్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని అన్నారు. ఈవీ, బ్యాటరీల తయారీ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. కొంగరకలాన్లో ఫాక్స్కాన్ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వొచ్చిందని అన్నారు. ఫాక్స్కాన్ సంస్థకు 200 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
లైఫ్ సైన్సెస్ ఫెలోషిప్ కోసం దరఖాస్తులకు ఆహ్వానం : ట్వీట్ చేసిన మంత్రి కెటిఆర్
టీఎస్ లైఫ్ సైన్సెస్ ఫెలోషిప్ కోసం తెలంగాణ సర్కార్ దరఖాస్తులను ఆహ్వానించింది. మానవ జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు నిపుణులు ముందుకు రావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం టీఎస్ లైఫ్ సైన్సెస్ ఫెలోషిప్ అందిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టంను 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన టీఎస్ లైఫ్ సైన్సెస్ ఫెలోషిప్ కోసం నిబద్ధత కలిగిన నిపుణులు దరఖాస్తు చేసుకోవాలని కేటీఆర్ కోరారు.