- సిఎం కెసిఆర్ తీరుపై మండిపడ్డ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా
- రాష్ట్రంలో పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభించిన పార్టీ చీఫ్
- మోదీని బ్రోకర్ అన్న కెటిఆర్ను ఉరికించి కొడతారు
- తెలంగాణలో వొచ్చేది బిజెపి ప్రభుత్వమే అన్న పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్
న్యూ దిల్లీ/హైదరాబాద్, మార్చి 31 : ఉట్టికి ఎగరలేనమ్మ..ఆకాశానికి ఎగిరినట్లుగా సిఎం కెసిఆర్ వ్యవహార శైలి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణలోనే పాలన చేతగాని కెసిఆర్ దేశాన్ని ఏలుతానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు. లిక్కర్ స్కామ్తో కవిత తెలంగాణ పరువు తీసిందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బీజేపీ కార్యాలయాలు నిర్మిస్తున్నామని నడ్డా అన్నారు. శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ కార్యాలయాలను నడ్డ వర్చువల్గా ప్రాంభించారు. రాష్ట్రంలో 108 కార్యాలయాల నిర్మాణం జరుగుతుందని నడ్డా అన్నారు. రాష్ట్రాల్లో సంస్థాగతంగా పార్టీని విస్తరింపజేస్తున్నామని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 500 బీజేపీ కార్యాలయాలు నిర్మించామని తెలిపారు. ఇవి కార్యాలయాలు కాదు..సంస్కార్ కేంద్రాలని నడ్డా పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఐదు జిల్లా కార్యాలయాలను ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి బండి సంజయ్, మురళీదర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ..మోదీని తిడుతున్న కెటిఆర్ను ప్రజలు ఉరికించి కొడతారని అన్నారు. మోదీని బ్రోకర్ అంటున్న కెటిఆర్కు తగిన గుణపాఠం తప్పదన్నారు. ప్రధానిని తిడుతూ కల్వకుంట్ల కుటుంబం టైమ్ పాస్ పాలిటిక్స్ చేస్తుందని అన్నారు. మోదీని బ్రోకర్ అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..కేటీఆర్ బ్రోకర్..కేసీఆర్ పాస్ పోర్టు బ్రోకర్ అని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకై 30 లక్షల మంది భవిష్యత్ నాశనం అయితే..కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి..సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ టిల్లు కేటీఆర్, లిక్కర్ క్వీన్ కవిత, హ్యాపీ రావు సంతోష్, అగ్గిపెట్టె రావు హరీష్ రావులే తెలంగాణను ఏలుతున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హావి•లను నెరవేర్చడం లేదన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు అడ్డుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో ఏ ఉప ఎన్నిక జరిగినా బీజేపీ గెలుస్తుందని…రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వొస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన పార్టీగా బీజేపీ అవతరించిందని చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు రాలేదని బండి సంజయ్ వెల్లడించారు.