- కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు కలసికట్టుగా పోరాడాలి
- మోదీ అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి
- బిఆర్ఎస్తో పొత్తుపై ఎన్నికలప్పుడే నిర్ణయం
- ఎన్నికల తరువాత పొత్తులు తప్పవనుకుంటే ప్రజలే నిర్ణయిస్తారు
- సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి
- టీఎస్పీఎస్సీ పేపర్ లీక్పై ప్రభుత్వం నిర్లక్ష్యం : సీనియర్ కాంగ్రెస్ నేత మల్లు రవి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31 : కేంద్రం రాహుల్ గాంధీపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి విమర్శించారు. రాహుల్ ఎంపీ సభ్యత్వం రద్దు చేయడాన్ని ఖండించిన జానారెడ్డి..ప్రతిపక్షాలు ఐక్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కేంద్రం తీరుపై 17 విపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయని అన్నారు. కేంద్రం నియంతృత్వ ధోరణిని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. కేంద్రం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని జానారెడ్డి ఆరోపించారు. పార్లమెంట్లో ఆదానీ, మోదీల సంబంధాన్ని ప్రశ్నించినప్పటి నుంచే రాహుల్పై కక్ష కట్టారని ఆరోపించారు. ఆ తర్వాత వెనువెంటనే రాహుల్ కేసుపై కోర్టు తీర్పు ఇవ్వడం, అనర్హత వేటు వేయడం, బంగ్లాను ఖాళీ చేయాలని చెప్పడం ఇవన్నీ కుట్రలో భాగంగానే చేశారని జానారెడ్డి ఆరోపించారు. దేశంలో ఇంత వేగంగా తీర్పులు అమలైనటువంటి సందర్భాలు ఎక్కడా లేవన్నారు. అదాని పెట్టుబడులను ప్రశ్నిస్తున్న రాహుల్ గొంతును.. మోదీ నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
మోదీ అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలన్నారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తుపై కాంగ్రెస్ నేత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత పొత్తు తప్పదనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దును జానారెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేంద్రం పనిచేస్తోందని, కేంద్ర నియంతృత్వ ధోరణిని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. కేంద్ర తీరుపై 17 ప్రతిపక్ష పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నామని జానారెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలు ఐక్యతగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీని ఎదుర్కునేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని, బీఆర్ఎస్ కూడా ఇప్పటికే రాహుల్ గాంధీకి అండగా నిలిచినట్లు చెప్పారు. రాహుల్ కేసులు పెడితే బీజేపీ వాళ్లంతా జైల్లో ఉంటారని హెచ్చరించారు. బీఆర్ఎస్తో పొత్తు అనేది ఎన్నికలప్పుడు నిర్ణయించుకుంటామని జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన కొడుకు వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆయన తెలిపారు. దేశంలో పెట్టుబడిదారులకు బీజేపీ కొమ్ముకాస్తోందని, అదానీ గురించి ప్రశ్నించినందుకే రాహుల్పై వేటు వేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారం కోసం మోదీ సర్కార్ అరాచకం చేస్తోందని ఆరోపించారు. బీజేపీపై పోరుకు, ఎన్నికలకు సంబంధం లేదన్నారు. పార్లమెంట్లో రాహుల్పై వేటు వేయడంపై దేశం అట్టుడుకుతుందని, అదానీ కంపెనీలో షేర్లు కొనుగోలు చేసినవారు ఆందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. మోదీ, అదానీ మధ్య ఉన్న సంబంధం బయటపెట్టినందుకే పార్లమెంట్లో రాహుల్ గొంతు నొక్కారని జనారెడ్డి విమర్శించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని, ప్రజాస్వామ్య విలువలు కాపాడేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని జానారెడ్డి పేర్కొన్నారు. పొత్తులపై జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. వొచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు ఉంటుందని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ బీఆర్ఎస్తో పొత్తుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం బీఆర్ఎస్తో పొత్తు ఉండదంటూ గతంలో తెలుపడం గమనార్హం.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్పై ప్రభుత్వం నిర్లక్ష్యం : సీనియర్ కాంగ్రెస్ నేత మల్లు రవి
రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా పని చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్కు సంబంధించిన వ్యవహారంలో ఇంత నిర్లక్ష్యం దారుణమన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ వి•డియాతో మాట్లాడుతూ…30 లక్షల మంది నిరుద్యోగుల విషయంలో జరుగుతున్న అన్యాయలపై ప్రభుత్వం ఏ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ విషయంలో తెలంగాణ సమాజం చాలా ఆందోళనలో ఉందని..కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పటికే పోరాటాన్ని ఉదృతం చేశామని చెప్పారు. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి, విస్తరించేందుకు టీపీసీసీ ఒక ఉద్యమ కార్యాచరణ కమిటీ వేసిందని, కమిటీ సమావేశం శుక్రవారం జరిగిందన్నారు. కమిటీ ఆధ్వర్యంలో వరుస ఉద్యమాలను చేపట్టాలని నిర్ణయించడం జరిగిందన్నారు. సిట్ విచారణ జరగక ముందే మంత్రి కేటీఆర్ ఇద్దరి వల్లనే ఈ పేపర్ లీక్ జరిగిందని చెప్పడం సిట్పై ప్రభావం చూపడమేనని మల్లు రవి అన్నారు.
అందుకే సిబిఐ, సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ కమిటీ రద్దు చేసి కొత్త కమిటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించాలని…గవర్నర్, రాష్ట్రపతి ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. అందుకోసం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను మినహాయించి అన్ని పార్టీలు, యువజన, విద్యార్థి సంఘాలతో కలిసి పోరాటం చేసి న్యాయం జరిగే విధంగా చేస్తామని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ ఈడీకి ఫిర్యాదు చేయనున్నట్లు మల్లు రవి స్పష్టం చేశారు. బలమూరి వెంకట్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం చాలా అక్రమాలతో కూడుకున్నదని, ఇప్పటికే ఈ అంశంలో కాంగ్రెస్ వీధి పోరాటాలు, రాజకీయ ఉద్యమాలు, న్యాయ పోరాటాలు చేయడం జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.