టీకా తీసుకున్నప్పటికీ ముప్పు ఉంటుంది సిడిసి అధ్యయనం వెల్లడి
వయసు పైబడిన వారిపై బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. మరీ ముఖ్యంగా ఇప్పటికే పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాక్సినేషన్ పూర్తయినా కోవిడ్ సోకితే మరింత ప్రమాదంగా పరిణమించే ప్రమాదం ఉందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనం హెచ్చరించింది. ఇలాంటి వారు జాగ్రత్తగా ఉండాల్సిందేనని తెలిపింది. టీకా తీసుకున్నా అనేక రుగ్మతలతో ఉన్నవారు జాగ్రత్తగా లేకుంటే కొరోనా సమస్యలు తప్పవని గుర్తించారు. రెండు టీకా డోసులు వేయించుకున్న తర్వాత కూడా కొరోనా సోకితే దానిని ‘బ్రేక్ త్రూ’ ఇన్ఫెక్షన్గా వ్యవహరిస్తారు. తీవ్రమైన బ్రేక్ త్రూ కేసులకు సంబంధించి ఆగస్టు 30 నాటికి సీడీసీ 12,908 నివేదికలు అందుకుంది. ఇందులో హాస్పిటల్ పాలైనవారు, చనిపోయిన వారి కేసులు కూడా ఉన్నాయి.
సీడీసీకి అందిన నివేదికల ప్రకారం..హాస్పిటల్లో చేరడానికి కారణమైన దాదాపు 70 శాతం కేసులు 65 ఏళ్లు పైబడిన పెద్దవారిలో ఉన్నాయి. అంతేకాక, బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ కారణంగా మరణించిన వారిలో 65 ఏళ్లు అంతకంటే పైబడిన వారు ఉండడం గమనార్హం. జనవరి 24-జులై 24 మధ్య సీడీసీ ఈ అధ్యయనం నిర్వహించింది. వయసు పైబడిన వారికి సంబంధించి మొత్తంగా 4,700 హాస్పిటలైజేషన్లను కొవిడ్-నెట్ ద్వారా విశ్లేషించింది. అయితే, ఈ అధ్యయనాన్ని పీర్-రివ్యూ చేయాల్సి ఉంది. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్కు గురై హాస్పిటళ్లలో చేరుతున్న వారిలో మధ్యస్తంగా 73 ఏళ్లు వారు ఉన్నారు. వీరిలో దాదాపు 71 శాతం మందిలో మధుమేహం, గుండె జబ్బులు, ఆటోఇమ్యూనో కండిషన్స్ వంటివి ఉన్నట్టు గుర్తించారు. టీకాలు తీసుకోకుండా కోవిడ్ బారినపడి హాస్పిటళ్లలో చేరుతున్న వారి మధ్యస్త వయసు 59 ఏళ్లు. వీరిలోనూ 56 శాతం మంది మూడు అంతకంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు అధ్యయనం వివరించింది.