ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సిఎస్ శాంతి కుమారి సమీక్ష
జిల్లాల నుంచి ప్రజలను తరలించడానికి ఏర్పాట్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : రేపు 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో సమీక్షించారు. బుధవారం బిఆర్కెఆర్ భవన్లో జరిగిన సమావేశంలో, ప్రముఖుల వాహనాల రాకపోకల కోసం నిర్దేశించిన అలైటింగ్ పాయింట్ల వద్ద తగు ఏర్పాట్లు చేయాలని సిఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు , వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు, మున్సిపల్ మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, ప్రజాప్రతినిధులు, ఐఎఎస్, ఐపిఎస్, నేషనల్ మీడియా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు సమావేశానికి హాజరవుతున్నందున వారికి అసౌకర్యం కలగకుండా వేరు వేరుగా అలైటింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని సిఎస్ అధికారులకు సూచించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి మహారాష్ట్ర, ఆంధప్రదేశ్, మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో అతిథులు హాజరవుతున్నందున, వాహనాల హాల్టింగ్ పాయింట్లు కూడా సమీపంలో ఏర్పాటు చేసుకోవాలని సిఎస్ సూచించారు.
సమావేశానికి వొస్తున్న అతిథులు, కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా త్రాగు నీరు, మజ్జిగ, స్నాక్స్, పానీయాలు పంపిణీ చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. ప్రజలు విక్షించాడానికి ఎల్ఇడి తెరలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులతో పాటు జిల్లాల నుంచి వొచ్చే ప్రజలకు సరైన సీటింగ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సిఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిజిపి అంజనీ కుమార్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి శ్రీనివాస్రాజు, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా రాణా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జిల్లాల నుంచి ప్రజలను తరలించడానికి ఏర్పాట్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
అనంతరం జిల్లాల నుండి ప్రజలను తరలించడానికి చేసిన ఏర్పాట్లను కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్లో సిఎస్ సమీక్షించారు. మండల కేంద్రాలలో బస్సులు ముందు రోజే సిద్దంగా ఉంచాలని, బస్సులో ప్రయాణించే వారికి అల్పాహారంతో పాటు మధ్యాన్నం, రాత్రి భోజన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రతి బస్సులో పోలీస్ సిబ్బందితో పాటు ఒక ఎస్కార్ట్ ఆఫీ•సర్ ఉండాలని అన్నారు. ప్రజాప్రతినిధులకు ఆహ్వానం పత్రికలు అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు అందరు కృషి చేయాలని సి.ఎస్ కోరారు.