- దేశంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం
- ప్రారంభించనున్న సిఎం కెసిఆర్
- పెరగనున్న పర్యాటక ప్రాధాన్యం
- ఈ ఘట్టం చరిత్రలో సువర్ణాధ్యాయం : హాజరవుతున్న ప్రకాశ్ అంబేద్కర్
- దేశ చరిత్రలోనే ఓ మైలురాయి…రాష్ట్ర అభివృద్ధికి గీటురాయి : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక తత్వవేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం నేడు అట్టహాసంగా జరుగనుంది. 125 అడుగుల ఎత్తుతో దేశంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణ అపురూప ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. ట్యాంక్ బండ్ పరిసరాల్లో, ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాటు చేసిన విగ్రహం ఇకనుంచి పర్యాటక స్థలంగా కూడా విలసిల్లే అవకాశం ఉంది కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ హాజరవుతున్నారు. సిఎం కెసిఆర్ చేతులవి•దుగా దీనిని ప్రారంభించనున్నారు. కాగా కార్యకమ్రాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలను తరలించేందుకు ప్రత్యేక రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఇక అంబేద్కర్ అతి పెద్ద విగ్రహ ఏర్పాటుతో నెక్లెస్ రోడ్డు పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుంది. ప్రారంభ ఘట్టం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ తెలిపారు.
హైదరాబాద్ నగర నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్న దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ ఘట్టం చరిత్రలో సువర్ణాధ్యాయమని అభివర్ణించారు. అంబేద్కర్ ఆశయాలకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం అత్యంత శోభాయమానంగా జరుగుతున్నదని కొనియాడారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కే చంద్రశేఖర్రావు తీసుకొన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. దళితుల అభ్యున్నతికి కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోని గొప్ప నిర్ణయాన్ని కేసీఆర్ సర్కారు తీసుకొన్నది. ఆచరణలో కూడా చేసి చూపించింది. ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగున నిలిచి వివక్షకు గురైన దళిత సమాజోద్ధరణకు అంబేద్కర్ సాగించిన కృషిని భవిష్యత్తు తరాలు గుర్తుంచుకొనేలా ఆయనకు 125 అడుగుల మహా విగ్రహాన్ని నిర్మించతలపెట్టడం గొప్ప విషయం.
దేశ చరిత్రలోనే ఓ మైలురాయి… రాష్ట్ర అభివృద్దికి గీటురాయి : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని రైతులు, ప్రజలు కోరుకుంటున్నట్టు మంత్రి వేముల ప్రశాంత రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఎన్నో అద్భుత పథకాలకు శ్రీకారం చుట్టిన మేధావి సిఎం కెసిఆర్ అన్నారు. అన్నింటిని మించిన అద్భుతం అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు అన్నారు. దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం, అత్యున్నతమైన సచివాలయ నిర్మాణం జరగడం, ప్రారంభోత్సవాలకు సిద్దం కావడం అదృష్టమన్నారు. దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన జయంతి రోజు ప్రారంభించుకోవడం మంచి పరిణామమన్నారు. ఇవన్నీ చూసే ప్రజలు రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పాలన రావాలని కోరుకుంటున్నారని అన్నారు. బిజెపికి తెలంగాణలో పప్పులు ఉడకవన్నారు. వారి ఊకదంపుడు ఉపన్యాసాలను ప్రజలు నమ్మడం లేదన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఉచిత కరెంటుతో రెండు పంటలు సమృద్ధిగా పండుతున్నాయని మంత్రి చెప్పారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని.. అందుకే ప్రజలంతా తిరిగి సీఎం కేసీఆర్ పాలన కోరుకొంటున్నారని పేర్కొన్నారు. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వొచ్చిన తొమ్మిదేండ్లలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందాయని అన్నారు. నిరుపేద, బడుగు, బలహీనవర్గాల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించారు. మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు పొరుగు రాష్టాల్రైన మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. సమైక్య పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేశామని తెలిపారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయని, అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకుందామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, రాబోయే ఎన్నికల్లో వారికి అండగా ఉంటూ ఆశీర్వదించాలని కోరారు.