‘రాజు తలుచుకోవాలే గానీ..’ అన్నట్టుగా మంత్రి ఈటలపై భూ కబ్జా ఆరోపణలపై ఆగమేఘాల మీద అధికార యంత్రాంగం కదిలింది. శుక్రవారం రాత్రి సిఎం కేసీఆర్ ఆదేశించారు. శనివారం తెల్లావారేసరికి రెవెన్యూ యంత్రాంగం విచారణకు దిగింది. ఒక రైతుకు పాస్ పుస్తకం ఇవ్వాలంటే సవాలక్ష కారణాలు చూపిస్తూ ఏండ్ల తరబడి తిప్పుకునే అధికారులు క్షణాల్లో అచ్చంపేటలో తేలారు. దాదాపుగా 8 ఏండ్ల నుంచి ఒక్క తెల్ల రేషన్ కార్డు లేదు.. ఆరోగ్య శ్రీ కార్డు లేదు.. రోగాలతో సచ్చిపోతున్నాం.. ఎంక్వయిరీ చేసి కార్డు ఇవ్వండి అంటూ మొత్తుకుంటున్నా కనికరించని ప్రభుత్వం.. ఈటల వ్యవహారంలో మాత్రం జెట్ స్పీడ్లో విచారణ ప్రారంభించారు. అచ్చంపేటకు వెళ్లిన రెవెన్యూ అధికారుల బృందం పలువురు రైతులను కలిసింది.
అక్కడ భూమి, షెడ్డుల నిర్మాణాలను ఫొటోలతో తీసుకున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ సైతం అచ్చంపేటను సందర్శించారు. సుమారు 10బృందాల వరకు వచ్చిన అధికారులు, సిబ్బంది బాధితుల నుంచి వివరాలు సేకరించారు. రికార్డులను పరిశీలించారు. ల్యాండ్ను డిజిటల్ సర్వే చేశారు. అంతిమంగా మాత్రం జమున హ్యాచరీస్ యజమాన్యం అసైన్డ్ భూములను కబ్జా చేసిందనే నిర్దారణకు వచ్చారు. కేవలం గంటల వ్యవధిలోన్లే రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆధారాలతో కూడిన నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం.
తొలుత జిల్లా కలెక్టర్ ద్వారా ప్రాథమిక నివేదికను సిఎస్కు పంపించారనీ, రాత్రికి మాత్రం పూర్తి నివేదికను సిఎం కేసీఆర్, సిఎస్కు పంపించినట్లు తెలుస్తుంది. ఈటల రాజేందర్పై భూ కబ్జా ఆరోపణలు వచ్చినట్లుగానే విజిలెన్స్, రెవెన్యూ అధికారులు చేసిన విచారణలోనూ అదే తేలడం…నివేదికను సిఎం కేసీఆర్కు పంపించడంతో నెక్సట్ సిఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారనే దానిపై హాట్ హాట్ చర్చకు దారి తీసింది.