- వ్యవసాయం రొటీన్ కాదు… మారుతున్న కాలానికనుగుణంగా మారాలి
- రైతులకు మంత్రి హరీష్రావు పిలుపు
వ్యవసాయం అనేది రొటీన్ పక్రియ కాదు..మారుతున్న కాలానికి అనుగుణంగా, మార్కెట్ డిమాండుకు అనుగుణంగానే మారాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు రైతులకు పిలుపునిచ్చారు. శనివారం సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్లో రైతు బాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 10 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగుకు శ్రీకారం చుట్టి…మొదటి ఆయిల్ ఫామ్ మొక్కలను మంత్రి హరీష్రావునాటారు. ఈ మేరకు ఆయిల్ ఫామ్ మొక్కలు నాటే కార్యక్రమం, వరి సాగులో వెదజల్లే పద్ధతిపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. ఆయిల్ ఫామ్ తోటల పెంపకం సముద్రతీర ప్రాంతాలకే అనుకూలంగా ఉండేది. కానీ, సిఎం కేసీఆర్ కృషి ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో గాలిలో తేమ శాతంతో ఆయిల్ ఫామ్ పంటలు పండించేందుకు తెలంగాణ రాష్ట్రంలో 26 జిల్లాలు అనుకూలంగా మారాయన్నారు. ఆయిల్ ఫామ్ లాభసాటి పంట. 60 వేల కోట్ల పామాయిల్ ఇతర దేశాల నుంచి కొనుగోలు- దిగుమతి చేసి మన దేశంలో వాడుకుంటున్నామని, మనకు మనమే పామాయిల్ తోటలు పెడితే ఎగుమతి చేసేలా ఎదుగుతామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యేడు భూమికి బరువైన దేశంలోనే అత్యధిక పంట పండిందని, 52 లక్షల ఎకరాల్లో యాసంగి, 1 కోటి 40 లక్షల వడ్లు-ధాన్యం పండించిందని, 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం -వడ్లు ఎఫ్ సీఐ కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. పామాయిల్ తోటలు పెంచి రైతులు అధిక ఆదాయం పొందాలన్నదే సిఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. పామాయిల్ సాగుకు అవసరమైన వనరులన్నీ సబ్సిడీ రూపంలో పెట్టుబడిగా ప్రభుత్వమే సాయం చేస్తదని మంత్రి వెల్లడించారు. సిఎం కేసీఆర్ తండ్లాట రైతు బాగు పడాలన్నదేననీ, పామాయిల్ సాగు డ్రిప్కై హెక్టారుకు 43 వేల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, రైతు కేవలం రూ.4300 రైతు చెల్లించాల్సి ఉంటుందని, మిగతా 39 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లింపు చేస్తుందన్నారు. ఒక్క ఎకరానికి 1 లక్షా 20 వేల రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం ఇస్తున్నదని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని రైతులకు మంత్రి సూచించారు.
సిద్ధిపేట జిల్లా రైతులను ఆయిల్ ఫామ్ సాగులో ముందుకు తీసుకుపోవాలన్నదే నా కోరిక అని, ప్రతి ఏటా మన దేశంలో 90 వేల కోట్ల పామాయిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీనిని నియంత్రించడంలో మన దేశం 70 లక్షల ఎకరాల్లో పామాయిల్ తోటలు సాగు చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా 8 లక్షల 25 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నదని, దేశ అవసరాలకు 70 లక్షల ఎకరాల పామాయిల్ సాగు చేయాలని, ఆ దిశగా సాగు చేస్తే విదేశాల నుంచి దిగుమతి నిలిచిపోతదని, ఇదంతా గమనించిన సిఎం కేసీఆర్ రాష్ట్రంలో 8 లక్షల 25 వేల ఎకరాలు పెట్టాలని నిర్ణయించినట్లు, అయితే సిద్ధిపేట జిల్లాలో 50 వేల ఎకరాల ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి సన్నాహాలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. పామాయిల్కు బహిరంగ మార్కెట్లో పుష్కలమైన డిమాండ్ ఉంది. అందరూ రైతులకు గిట్టుబాటు ధర అందించేలా.. అన్నీ రకాల ప్రోత్సాహకాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతులు ఆయిల్ ఫామ్ తోటలు పెంచేందుకు ముందుకు రావాలని మంత్రి హరీష్రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సంస్థ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.