- వెనక్కి తీసుకునే వరకు ఆపేది లేదంటున్న రైతుసంఘాలు
- నిర్దిష్టంగా సమస్యలుంటే చర్చించుకుందామంటున్న ప్రభుత్వం
- 3న మరోసారి జరుగనున్న చర్చలు
వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు, కేంద్రానికి మధ్య మొదటి రౌండ్ చర్చలు మంగళవారం జరిగాయి. తదుపరి రౌండ్ డిసెంబర్ 3న జరగనున్నాయి. రాజధాని శివార్లలో కొనసాగుతున్న నిరసనల మధ్య, ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో పలు రైతు సంఘాలు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర మంత్రి పియస్ గోయల్తో చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా యూనియన్ల ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం సిద్ధపడింది. ఈ కమిటీలో రైతు సంస్థల నుండి 4 లేదా 5 మంది వ్యక్తులు వుంటారు. కొత్త వ్యవసాయ చట్టాలను చర్చించడానికి ప్రభుత్వ ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు కమిటీలో ఉంటారని కేంద్రం తెలిపింది. రైతులతో జరిపిన చర్యల అనంతరం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ..‘‘వ్యవసాయ సంస్కరణ చట్టాలకు సంబంధించిన నిర్దిష్ట సమస్యలను గుర్తించి, డిసెంబర్ 2న ప్రభుత్వం ముందుకు తీసుకు వొచ్చి చర్చలకు స్వీకారం చేయమని ప్రభుత్వం.. రైతు సంఘాల ప్రతినిధులకు సూచించింది’’ అని ప్రకటించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ చర్చలకు హాజరవుతారనే చర్చ నడిచింది. అయితే వీరు మీటింగ్లో లేరు. ప్రభుత్వంతో చర్చలు జరిపిన అంతరం చర్చలు విఫలం అయ్యాయని ఆందోళన కొనసాగుతుందని, రైతులు స్పష్టం చేయగా.. మంత్రి తోమర్ మాత్రం సమావేశం సఫలం అని చెప్పే ప్రయత్నం చేసారు. సమావేశం తరువాత కూడా రైతు సంఘాలు ప్రభుత్వంతో తలపడటానికి సిద్ధం అంటున్నాయి. చట్టాల రద్దు తప్ప మరోటి మాకు వొద్దు అనేది రైతు సంఘాల వాదన. ‘‘మా ఉద్యమం కొనసాగుతుంది.
ఖచ్చితంగా ప్రభుత్వం మా డిమాండ్స్ అంగీకరించాలి. శాంతియుత ఉద్యమాన్ని బులెట్తో తొక్కేస్తామంటే బులెట్ తినడానికి సిద్ధం. మళ్లీ చర్చల కోసం వొస్తాం..మా డిమాండ్స్ చెబుతాం’’ అని రైతు ప్రతినిధి బృందం సభ్యుడు చందా సింగ్ సమావేశం అనంతరం మీడియాతో చెప్పారు. ‘‘నేటి సమావేశంతో మొదలు అయ్యింది. డిసెంబర్ 3న మా తదుపరి సమావేశంలో కొత్త వ్యవసాయ చట్టాల వలన ఏ అంశం కూడా రైతు అనుకూలం కాదని మా వాదం వినిపించడానికి మళ్ళీ వొస్తాం. మా ఆందోళన కొనసాగుతుంది,’’ అని ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ భంగూర్ చెప్పారు. ప్రభుత్వం రైతులు నిరసనలను నిలిపివేసి చర్చలకు రావాలని కోరుతున్నది.