- కెసిఆర్ ఉద్యోగం పోయే సమయం వచ్చింది
- 2లక్షల ఖాళీలు ఉంటే ..మిగితావి కాకి ఎత్తుకు పోయిందా
- కెసిఆర్ ఉద్యోగం ఊడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి
- పికె సలహాలతోనే ఉద్యోగాల లెక్కల ప్రకటన
- కెసిఆర్ తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్ రేవంత్
కెసిఆర్ ఉద్యోగం పోయే సమయం వచ్చిందని, అందుకే నిరుద్యోగుల ఆగ్రహం నుంచి బయటపడేందుకు ఉద్యోగాల ప్రకటన డ్రామా మొదలు పెట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఘాటుగా విమర్శించారు. కెసిఆర్ ఉద్యోగాన్ని ఊడబెరికితే మనమే 2 లక్షల ఉద్యోగాలు నియమించుకోవచ్చని అన్నారు. బిస్వాల్ కమిటీ పక్కకు పోయిందని, అలాగే గతంలో ఇచ్చిన ప్రకటనలు పక్కకు పోయి ఇప్పుడు 80వేల ఉద్యోగాలని అంటూ మోసానికి దిగారని అన్నారు. 2014లో లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ చేసిన ప్రకటనను రేవంత్రెడ్డి గుర్తు చేశారు. ఇవాళ 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారని, మిగిలిన ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. టీ కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మళ్లీ అబద్దాలు ఆడుతున్నారని రేవంత్రెడ్డి అన్నారు.
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన అంతా దగా అని దీనిని నిరుద్యోగులు నమ్మొద్దన్నారు. పికె రాసిచ్చిన మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారని సీఎం కేసీఆర్పై రేవంత్రెడ్డి విమర్శలు చేశారు. ఇకపోతే ఖాళీలు ఎప్పటి లోపు భర్తీ చేస్తారో చెప్పలేదని సెటైర్ వేశారు. గతంలో లక్ష ఏడూ వేలు ఖాళీలు ఉన్నాయని, మరొక 50 వేలు ఖాళీ కాబోతున్నాయని 7 సెప్టెంబర్ 2014 చెప్పారన్నారు. లక్ష 50 వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు.. బిస్వాల్ కమిటీ లక్ష 91 వేలు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు. 9 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇవాళ సభ లో కేసీఆర్ అబద్దాలు చెప్పాడని, లక్ష 50 వేలు ఖాళీలు ఉన్నాయని, 80 వేలు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ప్రకటించాడన్నారు. మిగిలిన ఉద్యోగాలు కాకి ఎత్తుకు పోయిందా అంటూ ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ని ఉద్యోగాలు అడుక్కోవాల్సిన అవసరం లేదని, 12 నెలలలో మన ప్రభుత్వం అధికారం లోకి వస్తుందని, కేసీఆర్ ఉద్యోగం పోతే తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు రావని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగులతో కాంగ్రెస్ ఆందోళనకు దిగడం,ప్రగగతిభవన్ ముట్టించడంతో సీఎం కేసీఆర్కు వణుకు పుట్టిందని చెప్పారు. అందుకే అసెంబ్లీలో ఆదరాబాదరాగా ఉద్యోగాల ప్రకటన చేశారన్నారు. నిరుద్యోగులను మరోసారి నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బిస్వాల్ కమిటీ లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని నివేదిక ఇస్తే కేవలం 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారని చెప్పారు. మిగతా లక్షకు పైగా ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.
ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతిపై ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పెడుతున్న సెగతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ వీడి జిల్లాలు తిరుగుతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఆశపెట్టి నెరవేర్చకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పరీక్షలు నిర్వహించి, నియామక పత్రాలు ఇచ్చే వరకు పోరాడతామని స్ఫష్టం చేశారు.కాంగ్రెస్ సభ్యత్వం తసీఉకున్న వారికి 2లక్షల ప్రమాద బీమా ఇస్తున్నామని అన్నారు. దీనిని సద్వినియోగం చేయాలన్నారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.