మరో వారం పాటు భక్తుల దర్శనాలకు అనుమతి లేదన్న ఇవో
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆర్జిత సేవలు ఆంతరంగికంగా బాలాలయంలోనే కొనసాగుతున్నాయి. భక్తులకు ఈ నెల 19 వరకు అనుమతి లేదని ఇప్పటికే ఇవో గీత ప్రకటించారు. సేవలకు భక్తులను నిలిపివేసి ఈ నెల 11వ తేదీ నాటికి నెల రోజులు పూర్తయింది. కొరోనాతో ఈ సంవత్సరం మరోసారి ఏకాంత సేవలకే పరిమితంచేశారు. సెకండ్వేవ్ ఉధృతిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం మే 12వ తేదీ నుంచి లాక్డౌన్ ఆంక్షలు విధించింది. లాక్డౌన్ నిబంధనలతో యాదాద్రీశుడి ఆలయంలోకి భక్తుల అనుమతి, ఆర్జిత సేవోత్సవాలు నిలిచి శుక్రవారం నాటికి నెల రోజులు పూర్తయింది. ఇదిలా ఉంటే స్వామి సన్నిధిలో భక్తులు నిర్వహించుకునే మొక్కు ఆర్జిత సేవోత్సవాలను ఆన్లైన్ ద్వారా వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది మార్చిలో కూడా కొరోనా కారణంగా యాదాద్రీశుడి సన్నిధిలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేయగా.., భక్తులు ఆన్లైన్ సేవల ద్వారా మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సంవత్సరం కూడా కోవిడ్ ప్రభావంతో భక్తులను అనమతించకపోవడంతో ఆన్లైన్ సేవల ద్వారా మొక్కులు చెల్లించుకుంటున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నిత్యోత్సవాలు నిరాడంబరంగా, ఆస్థానపరంగా కొనసాగాయి. ఉత్సవమూర్తులను ఆరాధిస్తూ నిజాభిషేకం, నిత్యార్చనలు నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా ఆర్జిత సేవలను నమోదు చేసుకున్న భక్తుల పేరిట అర్చకులు గోత్రనామాలతో పూజలు చేశారు. అదేవిధంగా అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ లక్ష్మీనారసింహుడికి నిత్య పూజలు ఏకాంతంగా నిర్వహించారు.
లాక్డౌన్ కారణంగా స్వామికి నిత్యవిధి కైంకర్యాలను ఆంతరంగికంగా, ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. విశేష ఉత్సవాలను సైతం అర్చక, అధికారులు పరిమిత సంఖ్యలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్నారు. యాదాద్రిక్షేత్రంలో ప్లవనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సరాది, శ్రీరామ నవమి, నృసింహ జయంతి, నమ్మాళ్వార్ తిరునక్షత్రం, ఏకాదశి లక్ష పుష్పార్చన, హనుమజ్జయంతి తదితర విశేష మహోత్సవాలు ఆంతరంగికంగా, నిరాడంబరంగా కొనసాగాయి.