- చిల్లర రాజకీయ పార్టీలు కాంగ్రెస్కు పోటీ కాదు
- 30 లక్షల సభ్యత్వం లక్ష్యంగా గాంధీభవన్లో మెంబర్షిప్
- సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు 2 లక్షల ఇన్సూరెన్స్
- గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు చేపడతామన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్
- వరి కొనకుండా ప్రభుత్వం రైతులను ఉరికి ఉసిగొల్పుతుందని ఫైర్
చిల్లర రాజకీయ పార్టీలు కాంగ్రెస్కు పోటీనే కాదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దేశం కోసం త్యాగం చేసిన నేతల పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. గాంధీ మొదలు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ఈ దేశంకోసం త్యాగాలు చేశారని అన్నారు. ఇప్పుడు సోనియా కూడా దేశం కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ది పథకాలను అమలు చేయించారని అన్నారు. గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. మార్చి వరకు రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వం చేయించాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న సభ్యుల రక్షణ కోసం 2 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.
తెల్ల దొరల నుంచి దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబ నాయకత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ఇతర పార్టీల నాయకత్వంలో సగం బ్రోకర్లు, సగం లోఫర్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రాజభరణాలు రద్దు చేసిందని, బ్యాంక్లను జాతీయం చేసిందని, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిందని గుర్తుచేశారు. 18 ఏళ్లకే వోటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ అని, ఐటిని అభివృద్ధి పరిచి కంప్యూటర్, సెల్ను అందరికీ పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ అని అన్నారు.రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వం చేస్తామని సోనియాకు మాటిచ్చామన్నారు.
ఆ మాటను నిలబెట్టుకునే బాధ్యత ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త వి•ద ఉందని తెలిపారు. నవంబర్ 9, 10 తేదీల్లో జిల్లా, మండల అధ్యక్షులకు శిక్షణ ఉంటుందన్నారు. వరి కొనకుండా ప్రభుత్వం రైతులను ఉరికి ఉసిగొల్పుతుందని రేవంత్ మండిపడ్డారు. మహేష్ అనే నిరుద్యోగ లేఖ రాసి చనిపోయాడన్నారు. ఇది కనువిప్పు కావాలన్నారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిదర్శనమన్నారు. 14 నుంచి 21 వరకు ఏడు రోజులు గ్రామాల్లో జన జాగరణ యాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 9న పరేడ్ గ్రౌండ్లో రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ప్రతీ బూతులో వంద మంది సభ్యత్వంతో మొత్తం 34 వేల బూతుల్లో 30 లక్షల సభ్యత్వం టార్గెట్ చేయాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1885లో స్థాపించిన కాంగ్రెస్ దేశానికి స్వాతంత్రం తెచ్చిందని..నవ భారత నిర్మాణానికి పునాదులు వేసిందని ఆ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అలాంటి కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోవడం గొప్ప అదృష్టమన్నారు. తెలంగాణలో 30 లక్షల సభ్యత్వం చేయాలన్నారు. ప్రజాస్వామ్యం వి•ద దాడి చేస్తున్న పార్టీ దేశాన్ని పాలిస్తుందని…జాతిని విచ్ఛిన్నం చేస్తుందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కక్ష గట్టి కాంగ్రెస్ కార్యకర్తల వి•ద భౌతిక దాడులు చేస్తుందని భట్టి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మానికమ్ టాగూర్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి, ప్రచార కమిటి చైర్మన్ మధు యాస్కీ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షులు హనుమంత రావు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.