మనదేశంలో ప్రతీ చిన్న వివాదానికి ఉన్నత న్యాయస్థానానికి వెళ్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించడంలేదు. అధికార ప్రతిపక్షాల మధ్య కనీస అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధానకారణం. పట్టు విడుపులు లేకుండా తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్ననానుడిగా ఈ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అధికార పార్టీని ప్రతిపక్షాలు శత్రువుగా చూస్తుండగా, అధికారంలో ఉన్న పార్టీలు విపక్షాలకు కనీస మర్యాదనివ్వ కపోవడమన్నది దేశంలో ఇప్పుడు సహజంగా మారింది. నిన్నగాక మొన్న తెలంగాణరాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవంలో ఇదే గొడవ. ఇప్పుడు దేశంలో అత్యున్నత చట్ట సభ భవనం ప్రారంభోత్సవంలోనూ అదే తంతు. వివిధ పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులకు ఎంతలేదన్నా మూడు నుండి నాలుగు దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ రాజ్యాంగపరంగా తాము చేస్తున్నది ఎంతవరకు సరైంది? విపక్షాలు ఎందుకని విమర్శిస్తున్నాయి అన్న విషయంలో కనీసంగానైనా ఆలోచన చేయాలన్న ఉద్దేశ్యం కనిపించక పోవడం లేదా ఆ పక్షాలకు వివరించి చెప్పక పోవడమన్నది కుంటి ఎద్దు అయినా తమదే గెలువాలన్న ధోణరణి స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ విషయంలో గత నాలుగైదు రోజులుగా పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఎవరికి వారు తమదే సరైన మార్గంగా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నవారే కనిపిస్తున్నారు. ఏమైతేనేమీ ఈ విషయంకూడా ఇప్పుడు సుప్రీమ్ కోర్టు పరిష్కరించాల్సిన పరిస్తితి ఏర్పడింది.
ఈ నిర్మాణాలు అత్యంత ప్రాధాన్యమైనవి, చరిత్రలో మరువలేనివి కావడంతో వాటి సూత్రధారులు ప్రారంభోత్సవాల్లో తమకే ప్రాధాన్యత ఉండాలనుకోవడం సహజం. తెలంగాణ సచివాలయ ప్రారంభంలో అదే జరిగింది, ఇప్పుడు పార్లమెంట్ ప్రారంభోత్సవం విషయంలోనూ అలాగే జరుగబోతున్నది. ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసిన ఈ పార్లమెంట్ (సెంట్రల్ విస్టా) భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేయబోవడమే ఈ వివాదానికి కారణంగా మారింది. రాజ్యాంగాన్ని పరిరక్షించడం, రాజ్యాంగానికి లోబడి చట్టాలను రూపొందించే ఈ భవనాన్ని అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి ద్వారానే ప్రారంభించాలన్నది విపక్షాల డిమాండ్. అంతేకాకుండా ఈ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానించకపోవడం ఒక విధంగా రాష్ట్రపతినే అవమానించినట్లవుతుందన్నది వారి వాదన. దీనిపై సుప్రీమ్ కోర్టు లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది.అత్యున్నత న్యాయ స్థానం విచారణకు అంగీకరించలేదు. ఈ నెల 28న ఈ భవన ప్రారంభోత్సవానికి కేంద్ర ప్రభుత్వం ముహూర్తాన్ని నిర్ణయించింది. అందుకు సంబంధించి పల రాష్ట్రాల నేతలకు ఆహ్వానాలుకూడా పంపడమైంది.
తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవంలో ఇక్కడి గవర్నర్కు ఆహ్వానం లేకపోవడంపట్ల ఇప్పటికే చర్చజరుగుతున్నది. గవర్నర్ను ఆహ్వానించకపోవడాన్ని కాంగ్రెస్, బిజెపిపార్టీలు అధికార బిఆర్ఎస్ పైన ఘాటైన విమర్శలు చేస్తున్నాయి. సాక్షాత్తు గవర్నర్ తమిళిసై కూడా తనకు ఆహ్వానమే అందలేదంటూ నర్మగర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్షిస్తున్న విషయం తెలిసిందే. అలాంటప్పుడు ప్రధానిని ఎలా విమర్శిస్తారన్నది బిజెపి వర్గాలు ఎత్తుచూపే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ను పిలవక పోవడం తప్పు కానప్పుడు, తాము రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం ఎలా తప్పు అవుతుందదని బిజెపి వర్గాలంటున్నాయి. అందుకే ముందుగా చెప్పుకున్నట్లు అధికారంలో ఉన్నప్పుడు తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధోరణిలోనే రాజకీయ పార్టీలుంటాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికారంలో ఉన్న పార్టీలు రాజ్యాంగ సూత్రాలను పక్కకు పెడుతున్నాయన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో రాష్ట్రపతి ది అత్యుత్తమ స్థానం. రాష్ట్రపతే ప్రధాన మంత్రిని, మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తారు.సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులను, గవర్నర్లను నియమించే రాజ్యాంగపరమైన అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. అలాంటప్పుడు రాష్ట్రపతిని ఎలా విస్మరిస్తారన్న సవాల్ విసురుతున్నాయి విపక్షాలు.
అంతేకాదు. రాష్ట్రపతి, ఉప రాష్ట్ర పతి తర్వాతనే ప్రధానిని పేర్కొంటారు. ఇక చట్ట సభల విషయానికి వొస్తే వరుసక్రమంలో రాష్ట్రపతి, ఉప•రాష్ట్రపతి తదుపరి ఉభయ సభలకు చెందిన స్పీకర్, రాజ్యసభ చైర్మన్ తర్వాత అయిదవ స్థానంలో ప్రధానికి గుర్తింపు ఉంటుందన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. దేశంలోని పందొమ్మిది ప్రధాన ప్రతిపక్షాలు ఇదే అంశంపైన విరుచుకు పడుతున్నాయి. ఆహ్వానాలు పంపినప్పటికీ తాము ప్రారంభోత్సవానికి హాజరయ్యేదిలేదని ఆ పక్షాలు కరాఖండీగా చెబుతున్నాయి. ఈమేరకు ఆ పార్టీలన్నీ కలిసి ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేసాయి కూడా.. పార్లమెంటు అన్నది ప్రజలు నిర్మించిన ప్రజాస్వామ్య దేవాలయం. అందులో ప్రధాన భాగం రాష్ట్రపతిది. రాష్ట్రపతి నుండి ఆ హక్కును లాక్కోవడం సరైందికాదని ఆ పక్షాలంటున్నాయి. కాంగ్రెస్తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ, తృణముల్ కాంగ్రెస్, డీఎంకె, జనతాదళ్ (యూనైటెడ్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, సమాజ్వాది, రాష్ట్రీయ జనతాదళ్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, ఝార్కండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్(మణి), ఆర్ఎస్పీ, వీసీకె, ఎండీఎంకే, ఆర్ఎల్డీ పార్టీలు బాయ్కాట్ చేస్తున్నవాటిల్లో ఉన్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ దీనిపై ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఏపీలోని అధికార పార్టీ వైఎస్ఆర్కాంగ్రెస్, అక్కడి ప్రధాన విపక్ష పార్టీ టిడిపి మాత్రం ప్రారంభోత్సవానికి వెళ్ళే విషయంలో సానుకూలంగానే స్పందించాయి.