- అవగాహన కార్యక్రమాల నిర్వహణ…
- అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీ, వాహనాలు ప్రదర్శన
- రేపు ‘‘పంచామృతం దిశగా ‘‘ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే
హైదరాబాద్, పిఐబి, ఫిబ్రవరి 02: ‘‘పంచామృతం దిశగా’’ కార్యక్రమాన్ని రేపు ఫిబ్రవరి 4న మనేసర్లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే ప్రారంభిస్తారు. హర్యానాలోని మనేసర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ(ఐసిఎటి)లో ‘‘పంచామృతం వైపు’’ కార్యక్రమం జరుగుతుంది. కాప్ 26లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘పంచామృతం’’ పై చేసిన ప్రకటనలకు అనుగుణంగా దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ రంగానికి ప్రోత్సాహం అందించి, అభివృద్ధి సాధించడానికి మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఐసిఎటి ఇంక్యుబేషన్ సెంటర్ను కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే, సహాయ మంత్రి క్రిషన్ పాల్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఆటోమొబైల్ పరిశ్రమ రంగానికిచెందిన ప్రముఖులు, నీతి ఆయోగ్, ఎంహెచ్ఐ, ఎంఓఆర్టీహెచ్, ఎంఎన్ఆర్ఈ, ఎంవోఈఎఫ్సీసీ, ఎంవోపీ, ఎంఓపీ అండ్ ఎన్జీ, విద్యావేత్తలు, స్టార్టప్ లు, విద్యార్థులు పాల్గొంటారు.
పీఎల్ఐ-ఆటో, పీఎల్ఐ- ఏసీసీ, ఫేమ్, క్యాపిటల్ గూడ్స్ రంగంలో ఎంహెచ్ఐ పథకాలు అమలు జరుగుతున్న తీరు చర్చించేందుకు ఆటోమోటివ్ పరిశ్రమ, ఎంహెచ్ఐ అధికారులతో ప్రత్యేక చర్చా కార్యక్రమం జరుగుతుంది. హరిత, పరిశుద్ధ ఇంధన వినియోగం కోసం అమలు జరుగుతున్న చర్యలు, కర్బన ఉద్గారాలు తగ్గించడానికి ఉపయోగపడే ఆవిష్కరణలు తదితర అంశాలు కార్యక్రమంలో చర్చకు వొస్తాయి. కర్బన ఉద్గారాల విడుదల తగ్గించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తుంది. హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాలు, జీవ ఇంధనాలు, గ్యాస్ ఇంధన వాహనాల కోసం సాంకేతికతలను అభివృద్ధి చేసే అంశంపై సాంకేతిక సదస్సులు జరుగుతాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అమలు చేయడానికి అమలు చేయాల్సిన విధానం, నియంత్రణ వ్యవస్థపై కార్యక్రమంలో చర్చలు జరుగుతాయి. దీని ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందుతుంది. ఐసీఏటీ ఇంక్యుబేషన్ సెంటర్ స్టార్టప్లను ప్రోత్సహించడంతో పాటు మార్కెట్కు సిద్ధంగా ఉన్న ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో వారికి తోడ్పాటు అందిస్తుంది. ఐసీఏటీలో అందుబాటులో ఉన్న టెస్టింగ్, సర్టిఫికేషన్ మౌలిక సదుపాయాలను ప్రతినిధులకు వివరిస్తారు.