మొత్తం 86.6 శాతం ఉత్తీర్ణత నమోదు
-మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయినా అధైర్య పడొద్ద్ను -పది పరీక్ష ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డ్ని్న -మొత్తం 2,793 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోద్ను -రాష్ట్రంలో 25 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు
ఫోటో రైటప్ : టెన్త్ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శ్రీదేవసేన ఐఎఎస్, విద్యా శాఖ అధికారులు
ముషీరాబాద్,ప్రజాతంత్ర,మే10 : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీదేవసేన, విద్యా శాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరిగిన పరీక్షలకు 2 లక్షల 49 వేల 747 బాలురు.. 2 లక్షల 44 వేల 873 మంది బాలికలు కలిపి మొత్తం 4 లక్షల 94 వేల 620 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. గతంలో ఉన్న 11 పేపర్లను 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
మొత్తం ఉత్తీర్ణత 86.6 శాతం నమోదు…
పదో తరగతి ఫలితాల్లో 86.6 శాతం ఉత్తీర్ణత నమోదైంది. టెన్త్ ఫలితాల్లో బాలికలు 88.53 శాతం, బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మొత్తం 4 లక్షల 91 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 4 లక్షల 19 వేల మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి పేర్కొన్నారు. 2,793 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఒక్క విద్యార్థీ పాస్ కాని పాఠశాలలు 25 ఉన్నాయని మంత్రి సబిత స్పష్టం చేశారు.
నిర్మల్ ఫస్ట్ట్… వికారాబాద్ లాస్ట్…
పది ఫలితాల్లో 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా అగ్రస్థానంలో నిలవగా… 59.46 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 7,492 మంది విద్యార్థులు ప్రైవేటుగా పరీక్షలు రాయగా… వారిలో 44.51 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.
25 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలే…
బుధవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసిన టెన్త్ ఫలితాల్లో మొత్తం 86.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా రాష్ట్రంలోని 25 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాకపోవడం గమనార్హం. దీంతో ఈ 25 స్కూళ్ల తీరు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.25 శాతం ఉత్తీర్ణత…
పది ఫలితాల్లో గణనీయంగా రెసిడెన్షియల్ స్కూల్స్ 98.25 శాతం ఉత్తీర్ణత సాధించాయి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 95.24 శాతం, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 95.03 శాతం, మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 94.66 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 92.93 శాతం, మోడల్ స్కూల్స్ 91.30 శాతం, ప్రైవేట్ స్కూల్స్ 90.90 శాతం, కేజీబీవీ స్కూల్స్ 83.86 శాతం, ఆశ్రమ స్కూల్స్ 77.67 శాతం, జిల్లా పరిషత్ స్కూల్స్ 79.47 శాతం, ప్రభుత్వ పాఠశాలలు 72.39 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఆ విద్యార్థులకు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలు…
కాగా.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో గతనెల 3 న తెలుగు జవాబు పత్రాల బండిల్ గల్లంతైన ఘటనలో 9 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాల వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.
జూన్ 14 నుంచి 22 వరకు సప్లిమెంటరీ…
జూన్ 14 నుంచి 22 వరకు టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం. 09-30 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఫీజు చెల్లింపు చివరి గడువు మే 26 వరకు ఉంటుందని మంత్రి చెప్పారు. మార్కులు రీ కౌంటింగ్ కొరకు ప్రతి సబ్జెక్టుకు రూ.500 ఫీజును సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్ధులంతా రీ-కౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలకు దరఖాస్తు చేసుకున్నా కూడా.. అందు కోసం ఎదురు చూడకుండా అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవ్వాలని అధికారులు సూచించారు.
విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు…
ఇంటర్ విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం బాధ అనిపించిందని మంత్రి సబితా అన్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. తప్పుడు నిర్ణయాలు తీసుకునేప్పుడు తల్లితండ్రుల కష్టం గుర్తు తెచ్చుకోండని సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులను కోరారు. వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, మార్కులు తక్కువగా వచ్చినా, ఫెయిల్ అయినా అధైర్య పడవద్దని మంత్రి సూచించారు.