పారదర్శకతతో ధాన్యం కొనుగోలు : మంత్రి
జిల్లాలో కరోనా వైరస్ దృష్ట్యా రైతులకు ఇబ్బంది కలగకుండా గ్రామాల్లోనే ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 4.35కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలుకు గాను 2.73మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి తెలిపారు.గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డిలతో కలిసి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన 296 కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న కొనుగోలు, రైతులకు చెల్లింపులు, గన్ని బ్యాగుల నిల్వలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఇట్టి కొనుగోలు ద్వారా 27, 173మంది రైతుల ఖాతాల్లో 285కోట్లు జమచేసినట్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా కొనుగోలును గ్రామాల్లోనే ఏర్పాటుచేసి , మద్దతు ధర కల్పిస్తున్నామని గుర్తుచేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతు జిల్లాలో ఉన్న 296ఐకేపీ, పిఎసిఎస్ కేంద్రాల్లో పూర్తిగా పారదర్శకత పాటించి కొనుగోలు చేస్తున్నారని, ఇప్పటికే 9లక్షల గన్ని బ్యాగులను వినియోగంలో ఉంచామని. మరో 5లక్షల 24వేల బ్యాగులు ఆర్డర్ చేశామని అన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ డి. సంజీవరెడ్డి, డిఎస్సిఓ విజయలక్ష్మి, డిఏఓ జ్యోతిర్మయి, మార్కెటింగ్ డిఎం పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కరోనాపై రాజీలేని పోరాటం చేస్తున్నాము
అనుక్షణం సూర్యాపేట పట్టణంను వాష్ చేయడానికి అధునాతన స్ఫ్రే యంత్రాన్ని కొనుగోలు చేశామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 8లక్షల 50వేల విలువ గల అధునాత స్ఫ్రే యంత్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. గంటకు పది నుండి 20మీటర్ల దూరంతో వెయ్యి లీటర్లు పిచికారి చేయగలిగే సామర్ధ్యం దీనిలో ఉందని అన్నారు. కరోనా పోరాటంలో ప్రజలు తప్పనిసరిగా భాగస్వాములు కావాలని కోరారు. గత రెండు నెలలుగా కరోనా కట్టడిలో విధులు నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది, అధికారుల పాత్ర అమోఘమని అన్నారు. అనంతరం పారిశుద్ద్య కార్మికులకు న్యాయవాది మల్లయ్య తన సొంత ఖర్చులతో కోడిగుడ్లను మంత్రి చేతలు మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, కమిషనర్ పి.రామాంజుల రెడ్డి, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, కౌన్సిలర్లు భరత్, దిలీప్ రెడ్డి, తాయర్ పాషా తదితరులు పాల్గొన్నారు.