యూనిఫారమ్ పోస్టులు మినహా నియామకాలకు గరిష్ట వయోపరిమితి 10 ఏండ్లు పెంపు
ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 9 : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ పక్రియను త్వరలోనే చేపడుతామని సీఎం శాసనసభా వేదికగా ప్రకటించారు. తెలంగాణ పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను, 2,774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని పదేండ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనివల్ల మరింతమంది ఉద్యోగార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నదని సీఎం తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 ఏండ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లకు, దివ్యాంగులకు 54 ఏండ్లకు గరిష్ట వయోపరిమితి పెరుగుతుందన్నారు.