- అది కాదని హైకోర్టులో కేసు వేశారు
- బకాయిలపై కోర్టులో వివరిస్తాం
- ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు
తెలంగాణ నుంచి తమకు రావాల్సిన బాకీలను చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏపీ జెన్కో తెలంగాణ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ బకాయిలపై తెలంగాణ ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ విద్యుత్ సంస్థలే తెలంగాణకు బాకీ ఉన్నాయన్నారు. రాష్ట్రానికి ఏపీ రూ.4,457 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. అది కాదని.. తమకు విద్యుత్ బకాయిలు ఇప్పించాలంటూ హైకోర్టులో ఏపీ పిటిషన్ దాఖలు చేసిందన్నారు.
ఈ క్రమంలో ఏపీ చెల్లించాల్సిన బకాయిల గురించి మాత్రం మాట్లాడట్లేదని, ఉమ్మడి ఏపీలో తీసుకున్న రుణాలు తెలంగాణ రూ. 2,725 కోట్లను చెల్లిస్తుందని అన్నారు. ఏపీ జెన్కో వాటాల విభజనలో తెలంగాణకు నిధులు రావాలని కృష్ణపట్నం ప్లాంట్లో తెలంగాణ డిస్కంల పెట్టిన పెట్టుబడి సొమ్ము వడ్డీతో సహా రూ. 1,611 కోట్లు రావాలని, బకాయిలన్నీ కలిపి లెక్కిస్తే తెలంగాణకే ఏపీ బాకీ ఉందని తెలిపారు. తెలంగాణ విద్యుత్ సంస్థలకే రూ. 4,457 కోట్లు చెల్లించాలని, కానీ మన రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై ఏపీ స్పందించట్లేదని, తెలంగాణ వాదనలను హైకోర్టుకు వివరిస్తామని సీఎండీ ప్రభాకర్ రావు తన ప్రకటనలో పేర్కొన్నారు.