Take a fresh look at your lifestyle.

రెండో టీ20 పిచ్‌ ‌క్యూరేటర్‌పై వేటు

లక్నో, జనవరి 31 : న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 టెస్టు మ్యాచ్‌ను తలపించింది. బ్యాటర్లు పరుగులు చేసేందుకు చెమటోడ్చారు. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉన్నా ఒక్క సిక్స్ ‌కూడా కొట్టలేకపోయారు. ఫోర్లు కూడా అంతంతమాత్రమే. దీంతో మ్యాచ్‌ అనంతరం పిచ్‌పై చాలా విమర్శలు వచ్చాయి. ఇలాంటి పిచ్‌లు తయారు చేయడమేంటని టీమిండియా కెప్టెన్‌ ‌హార్దిక్‌ ‌పాండ్యాతో పాటు కివీస్‌ ‌జట్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే లక్నో ఏకనా స్టేడియం పిచ్‌ ‌క్యూరేటర్‌పై వేటు వేసినట్లు ఉత్తర ప్రదేశ్‌ ‌క్రికెట్‌ అసోసియేషన్‌ ‌వర్గాలు వెల్లడించాయి. క్యూరేటర్‌పై అయితే వేటు వేశారు కానీ.. ఈ విషయంలో అసలు నిందించాల్సింది మాత్రం టీమిండియా మేనేజ్‌మెంట్‌ను అని తాజాగా వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది. నిజానికి ఈ మ్యాచ్‌ ‌కోసం క్యూరేటర్‌ ‌నల్ల మట్టితో చేసిన రెండు పిచ్‌లను రూపొందించాడట. అయితే మ్యాచ్‌కు మూడు రోజుల ముందు టీమిండియా మేనేజ్‌మెంట్‌ ‌సూచన మేరకు ఎర్ర మట్టి పిచ్‌ ‌తయారు చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.

సమయం తక్కువగా ఉండటంతో పిచ్‌ ‌సరిగా కుదరలేదని సమాచారం. దీంతో టీ20 మ్యాచ్‌కు అసలు పనికి రాని పిచ్‌ ‌తయారైంది. ఈ పిచ్‌ ‌పూర్తిగా స్పిన్‌కు అనుకూలించింది. మ్యాచ్‌లో మొత్తం 39.5 ఓవర్లు పడగా.. అందులో 30 ఓవర్లు స్పిన్నర్లే వేశారు. మొత్తంగా కేవలం 200 రన్స్ ‌మాత్రమే వచ్చాయి. అసలు ఈ పిచ్‌ ‌టీ20లకు పనికి రాదని మ్యాచ్‌ ‌తర్వాత పాండ్యా స్పష్టం చేశాడు.దీంతో ఇప్పటి వరకూ ఉన్న క్యూరేటర్‌ను తీసేసి గ్వాలియర్‌కు చెందిన సంజీవ్‌ అగర్వాల్‌ను నియమించారు. మార్చి నుంచి ఐపీఎల్‌ ‌జరగనున్న నేపథ్యంలో ఆ సమయానికి లక్నో పిచ్‌ను మెరుగ్గా చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు న్యూజిలాండ్‌ ‌తో మూడు టీ20ల సిరీస్‌ ‌ను 1-1తో సమం చేసిన టీమిండియా నిర్ణయాత్మక మూడో టీ20ని బుధవారం (ఫిబ్రవరి 1) అహ్మదాబాద్‌ ‌లో ఆడనుంది.

Leave a Reply