కొరోనా తీవ్రతతో వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా వైద్య, ఆరోగ్య శాఖ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ హాస్పిటల్స్కు చికిత్సల కోసం భారీ సంఖ్యలో వస్తున్న బాధితులకు వైద్య చికిత్సలు అందించాల్సి ఉన్నందున వైద్య శాఖ సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో కొరోనా బాధితుల కోసం 25 శాతం మేర పడకలను పెంచాలని నిర్ణయించింది,.. దీంతో పాటు ప్రైవేటు హాస్పిటల్స్లో సైతం కొరోనా బాధితులకు చికిత్సలు అందిస్తున్న దృష్ట్యా ఆ హాస్పిటల్స్లో అత్యవసరం కాని ఆపరేషన్లను వాయిదా వేయాలని ఆదేశించింది. కోవిడ్ బాధితులను హాస్పిటల్స్లో చేర్చేందుకు ప్రోటోకాల్ రూపొందించే యోచనలు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. అలాగే, గురువారం నాటికి ప్రభుత్వ హాస్పిటల్స్లోని పడకల వివరాలను ఆ శాఖ వెల్లడించింది. ఈమేరకు ప్రభుత్వ హాస్పిటల్స్లో 9,281 పడకలు ఉండగా, వాటిలో 6,654 ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. జీహెచ్ఎంసి పరిధిలో3,843 పడకలు ఉండగా, వాటిలో ప్రస్తుతం 2,649 ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది. ప్రైవేటు హాస్పిటల్స్లో సైతం అవసరమైన పక్షంలో బెడ్ల సంఖ్యను పెంచేలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. కోవిడ్ బాధితులను హాస్పిటల్స్లో చేర్పించేందుకు ప్రత్యేక ప్రోటోకాల్ ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రజలందరూ విధిగా మాస్కులు ధరించేలా అవగాహన కలిగించాలనీ, సమాజిక దూరం పాటించాలనీ, దీనిపై ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది.