ఇప్పటి వరకూ 25,34,304 మందికి పరీక్షలు
తాజాగా 7,665 మందికి పాజిటివ్
అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. సోమవారం నాటికి 25 లక్షల పరీక్షలు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 వరకు 46,999 మందికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 25,34,304కు చేరినట్టు వైద్యారోగ్యశాఖ సోమవారం బులెటిన్లో పేర్కొంది. ఇప్పటి వరకూ 25 లక్షలకు పైగా పరీక్షలు చేసిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉన్నాయి. దేశంలోనే అత్యధికంగా మిలియన్ జనాభాకు 47,459 పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
తగ్గిన పాజిటివ్ కేసులు
గడిచిన వారం రోజులుగా రోజుకు సగటున 10,000 పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, సోమవారం 7,665 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,35,525కి చేరింది. గడిచిన 24 గంటల్లో 6,924 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, మొత్తం 1,45,636 మంది కరోనా నుంచి కోలుకున్నారు.తాజాగా 80 మంది మృతితో మొత్తం మరణాలు 2,116కి చేరాయి.యాక్టివ్ కేసులు 87,773 ఉన్నాయి.