కొత్త సంవత్సరం అంటేనే ఎన్నో ఆశలు, మరెన్నో ఆకాంక్షలు. 2020 సంవత్సరం ఒక ప్రత్యేకత. విజన్ 2020, కొందరి స్వప్నాలు, నాటి లక్ష్యాన్నిటినీ తలకిందులు చేసింది 2020. సంవత్సర ప్రారంభంలో ఆస్ట్రేలియాలో కార్చిచ్చు వల్ల 18.6 మిలియన్ హెక్టార్ల అడవిబూడిదై, ,మూడు బిలియన్ల జంతువులు మరణించి వినాశకరమైన జీవవైవిధ్యం ఏర్పడింది.176 మంది ఉక్రెయిన్ ప్యాసింజర్ విమానాన్ని ఇరాన్ కాల్చివేయడంతో ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. ఇరాన్ వ్యూహకర్తల్లో ఒకరు ఖాసీం సులేమాన్ అమెరికా వైమానిక దాడిలో మరణించడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
1945 తర్వాత ప్రపంచం మొత్తం మొదటిసారి ఒక పెను ముప్పు ఎదుర్కొంది. చైనాలో ప్రారంభమైన కోవిడ్ భూగోళామంత చుట్టివేసింది. చరిత్ర ఎరుగని ఉపద్రవం ఏర్పడింది. కని, వినని లాక్డౌన్ , సామాజిక దూరం పదాలకు విస్తృత ప్రచారం కల్పించింది. కరోనా ఒక మిలియన్ మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19ని ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన తరువాత నిరుద్యోగ శాతం చారిత్రక రికార్డస్ నమోదుచేసింది. ఈ సంక్షోభంలో పురుషుల కంటే మహిళలు ఉద్యోగాలను వేగంగా కోల్పోయారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.
కోవిడ్-19 వల్ల ఈ సంవత్సరంలో అదనంగా 115 మిలియన్ల మంది పేదరికంలో మగ్గిపోయారు. అందులో అధిక వాటా దక్షిణాసియాలో ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా. ఆరోగ్య సంక్షోభం ప్రపంచ మాంద్యానికి దారితీసింది. ఐక్యరాజ్య సమితి పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం 2020 లో ప్రపంచంలో పోషకాహార లోపానికి గురయ్యే వారి సంఖ్య 83 నుంచి 132 మిలియన్స్ కు చేరుతుందని అంచనా. కోవిడ్-19 కారణంగా 160 కంటే ఎక్కువ దేశాల్లో కనీసం 1.5 బిలియన్ల విద్యార్థులు పాఠశాల ప్రత్యక్ష బోధనకు దూరమయ్యారు. సంక్షోభంలో అభ్యసనాన్ని కొనసాగించడానికి డిజిటల్ లర్నింగ్ ప్రారంభించారు కానీ గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు డిజిటల్ లర్నింగ్ సక్రమంగా అందడం లేదు. లాక్డౌన్ వల్ల డిజిటల్ కనెక్టివిటీ అవసరం అన్ని వర్గాలకు ఏర్పడి ఇ-చెల్లింపులు, డిజిటల్ నగదు చెల్లింపులు పెరిగాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఓ కొత్త పనివిధానం ఆచరణలోకి వచ్చింది. కరోనాకు టీకాను రికార్డు వేగంతో కనుగొనడం ఒక విజయం. అమెరికాలో జార్జ్ ఫ్రాయిడ్ హత్యానంతరం ఉప్పొంగిన ఉద్యమం అమెరికాను అతలాకుతలం చేసింది .జార్జ్ ఫ్రాయిడ్ హత్య అమెరికాలోని జాతి వివక్షతను ప్రపంచం ముందు ఉంచింది. కరోనా వణుకులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు వేడి పుట్టించాయి. ప్రపంచస్థాయి ఒప్పందాల నుంచి తప్పుకొని అమెరికానే కాక ప్రపంచ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు డోనాల్డ్ ట్రంప్. అవి సరిదిద్దడం కొత్త అధ్యక్షుడు జో బైడాన్ కు పద్మ వ్యూహాన్ని ఛేదించడమే.
దక్షిణ చైనా సముద్రంలో చైనా చర్యలు వియత్నాం, మలేషియా,ఫిలిప్పీన్స్, ఇండోనేషియా ఆగ్నేయాసియా దేశాలను ఆందోళనకు గురిచేశాయి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కరోనా సృష్టించిన విషాదంమరో ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది. గాల్వాన్ లోయలో జూన్ 15న నిరాయుధులైన భారత సైనికుల పై చైనా దాడికి భారత సైనికులు దీటుగా జవాబు ఇవ్వడంతో యుద్ధ మేఘాలు కమ్ముకు న్నాయి. అమెరికా జోక్యంతో ఇజ్రాయిల్ – యూ ఏ ఈ మధ్య ఒప్పందం పశ్చిమాసియనే గాక ప్రపంచాన్ని రెండు విభిన్న అభిప్రాయాలున్న దేశాలుగా విభజించింది. 2020 సంవత్సరం ఎవరూ ఊహించని, జ్యోతిషశాస్త్రం అంచనా వేయని చేదు అనుభవాల మిగిల్చింది. శాంతి, సుస్థిరతను ప్రమాదంలోకి నెట్టివేసింది. కొత్త సంవత్సరమైనా ప్రజలకు కొత్త భవిష్యత్తు అందిస్తుందని ఆశిద్దాం.
జుర్రు నారాయణ యాదవ్
టి టి యు జిల్లా అధ్యక్షులు
మహబూబ్నగర్, 9494019270