- కొరోనా వల్ల ఇప్పటివరకు 939 మంది మృతి
- ప్లాస్మా థెరఫీకి ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు
- ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్
భారత్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 1543 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 బాధితుల సంఖ్య 29,435కు చేరింది. 24 గంటల వ్యవధిలో 684 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 23.3శాతంగా ఉంది. ఇప్పటి వరకు 6,864 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం సాయంత్రం వరకు కొరోనా వల్ల 939 మంది మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి కొరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కొరోనా మహమ్మారి బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య ఆశాజనకంగా పెరుగుతున్నా తాజా కేసుల సంఖ్య ఆందోళనకరంగా కొనసాగుతోంది.
6868 మంది వైరస్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు. రికవరీ రేటు 23.3 శాతానికి చేరడం, కేసులు రెట్టింపయ్యే డబ్లింగ్ రేటు 10.2 రోజులకు పెరగడం ఊరట కలిగించే పరిణామమని అన్నారు. ఇక దేశవ్యాప్తంగా మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 934కు పెరిగిందని చెప్పారు. 17 జిల్లాల్లో 28 రోజులుగా ఎలాంటి కేసులూ వెలుగుచూడలేదని అన్నారు. కేసులు అధికంగా ఉన్న గుజరాత్కు రెండు కేంద్ర బృందాలు చేరుకున్నాయని తెలిపారు. కాగా ప్లాస్మా థెరఫీని ఐసీఎంఆర్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోందని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్కు చికిత్సగా ప్లాస్మా థెరఫీని వాడవచ్చనేందుకు ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. ప్లాస్మా థెరఫీని జాగ్రత్తగా చేయకుంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంది.