నగరంలోని జంక్షన్లు, సెంట్రల్ మెయిడెన్ల సుందరీకరణ పనులు ఈనెల 15 లోగా పూర్తి చేయాలని మహానగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ మడికొండ రాంపూర్ నుండి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు ప్రధాన రహదారి గుండా ఆకస్మికంగా పర్యటించి రహదారుల మధ్యలో గల సెంట్రల్ మెయిడెన్లను, జంక్షన్లను పరిశీలించి ఏపుగా పెరిగిన మొక్కల కత్తిరింపులు, కలుపు మొక్కలు తీయాలని ఆదేశించారు.
ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో మొక్కలు నాటి భర్తీ చేసి సుందరీకరణ తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు ఈ నెల 17న జిల్లాకు రాక సందర్భంగా నగరంలో ఉన్న అన్ని జంక్షన్లు, సెంట్రల్ మెయిడెన్లు అందంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. రహదారులలో అవెన్యూ ప్లాంటేషన్లను పరిశీలించి, రహదారుల్లో ఖాళీగా ఉన్న ప్రదేశాలలో వెంటనే అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కమీషనర్ వెంట బల్దియా సిహెచ్ఓ సునీత, కుడా హార్టికల్చర్ ఆఫీసర్ ప్రకాష్ తదితరులు ఉన్నారు.