- రాష్ట్రంలో కొరోనా కేసులు 471
- 414 మందికి చికిత్స కొనసాగుతోంది,
- నేడు 70 మంది డిశ్చార్జి అయ్యే అవకాశం
- 22 కల్లా అందరినీ డిశ్చార్జి చేస్తాం
- గాంధీ ఆసుపత్రి కేవలం కొరోనా రోగుల చికిత్సకే
- ఇకపై కింగ్కోఠి ఆసుపత్రిలో ఓపీ సేవలు
- రాష్ట్రవ్యాప్తంగా 101 హాట్స్పాట్ జోన్ల ఏర్పాటు
- మర్కజ్ కేసులు లేకుంటే తెలంగాణ కొరోనా ఫ్రీ అయ్యేది
- హైదరాబాద్లో సీఎం, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల పర్యటన
- ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
రాష్ట్రంలో కొరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 471 చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం కొత్తగా 18 కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయనీ, ప్రస్తుతం 414 మందికి వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇకపై గాంధీ ఆసుపత్రిని కేవలం కొరోనా పాజిటివ్గా వచ్చిన వారికి వైద్య చికిత్సలకు మాత్రమే వినియోగిస్తామనీ, వైరస్ లక్షనాలు ఉన్న అనుమానితులు కింగ్కోఠి ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. గురువారం కోఠిలోని కంట్రోల్ కమాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొరోనా పాజిటి•తో ఇప్పటి వరకు 12 మంది మరణించగా, కోలుకుని 45 మంది డిశ్చార్జి అయినట్లు వెల్లడించారు. గురువారం 665 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కేవలం 18 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చిందనీ, దీంతో క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని చెప్పారు. వచ్చిన వారిలో 388 మంది దిల్లీ మర్కజ్కు వెళ్లి వచ్చిన వారే••, వారిని కలిసిన వారేననీ, మర్కజ్ కేసులు లేకుంటే తెలంగాణ ఇప్పటికే కొరోనా రహిత రాష్ట్రంగా ఉండేదని పేర్కొన్నారు.
గురువారం రాత్రికి మరొకొంతమందికి నిర్వహించిన పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందనీ, శుక్రవారం 60 నుంచి 70 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 22 వరకల్లా ప్రస్తుతం చికిత్స పొందుతున్న అందరినీ డిశ్చార్జి చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వైరస్ ప్రబలుతున్న ప్రాంతాల దృష్ట్యా మొత్తం 101 హాట్ స్పాట్ జోన్లుగా గుర్తించామనీ, వీటి పరిసర ప్రాంతాలలోకి ఎవరినీ వెళ్లకుండా ఆంక్షలు విధించినట్లు చెప్పారు. రాష్ట్రంలో లాక్డౌన్ వంటి కఠిన ఆంక్షల నేపథ్యంలో గతంలో మాదిరిగా వేల సంఖ్యలో శాంపిల్స్ వచ్చే అవకాశం లేదని తెలిపారు. ఇది ఒక్కరోజు, వారంతో పోయేది కాదు కాబట్టి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎక్కడ పాజిటివ్ కేసులు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు ఉన్న దృష్ట్యా జీహెచ్ఎంసి పరిధిలో 12 ప్రాంతాలను ఇప్పటికే కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించామనీ, ఈ ప్రాంతాలలో ప్రతీ రోజూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు విస్త•తంగా పర్యటించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో మర్కజీ కేసులు నమోదైన సమయంలోనే లాక్డౌన్ ప్రకటించడంతో పాజిటివ్ కేసులను గణనీయంగా తగ్గించగలిగామని వెల్లడించారు. చిన్న ఇంట్లో హోం క్వారంటైన్లో ఉండే వ్యక్తులు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలనీ, దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వారెవరైనా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు పాజిటివ్ రోగులను కంటికి రెప్పలా చూసుకుంటున్నారని వెల్లడించారు. నెగెటివ్ వచ్చిన వారికి కూడా తిరిగి పరీక్షలు నిర్వహించిన తరువాతనే డిశ్చార్జి చేస్తామనీ, కేసుల సంఖ్య తగ్గుతున్నదని దీనిపై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించేది లేదని ఈ స•దర్భంగా మంత్రి ఈటల స్పష్టం చేశారు.
కొరోనా ప్రభావిత ప్రాంతాల్లో కొత్త మార్గదర్శకాలు:
తెలంగాణలో కొరోనా ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సిబ్బందికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వైద్య సిబ్బందికి ఎలాంటి హాని కలుగకుండా చూసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్రంలో ఇప్పటి వరకు అమలవుతున్న మార్గదర్శకాల స్థానంలో కొత్త వాటిని చేర్చారు. ముఖ్యంగా కొరోనా బారిన పడి మరణించి వారి విషయంలో, డెడ్ బాడీని తరలింపు, అంత్యక్రియలో విషయంలో సెపరేట్ సింగిల్ రూమ్ మార్చురీలను ఏర్పాటు చేయాలని ఆయా ఆసుపత్రుల ఇంచార్జీలను ప్రభుత్వం ఆదేశించింది. డెడ్బాడీని తరలించే సమయంలో ఒక్క అంబులెన్సుతో 6 పీపీఈ కిట్లు పంపాలనీ, డ్రైవర్, హెల్పర్, నలుగురు కోవిడ్ డెడ్బాడీ అటెండెంట్లకు పీపీఈ కిట్లు అందజేయాలని పేర్కొన్నారు. ఫ్రీజర్ కొనడం గానీ, అద్దెకు తీసుకోవడం గానీ చేయాలనీ, డెడ్ బాడీని తరలించిన తరువాత ఆ ఫ్లోర్, కిటికీలు, వెంటిలేటర్లు, రూఫ్లకు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం కనీసం ఆరుసార్లు స్ప్రే చేయాలనీ, వీటిని తీసుకెళ్లడం కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు ఆ మార్గదర్శకాలలో వెల్లడించారు.