- భూ రికార్డుల నిర్వహణ పూర్తి పారదర్శకంగా ఉండాలి
- ధరణి పోర్టల్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్ష
రాష్ట్రంలోని గ్రామలు,పట్టణాల్లో ఇప్పటికీ ఆన్లైన్లో నమోదు కాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చే లోపే మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటి వరకు నమోదు కాని ఆస్తుల వివరాలను సేకరించాలని పేర్కొన్నారు. నూతన రెవెన్యూ చట్టం అమలులో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్ రూపకల్పనపై మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, సీఎంవో ఉన్నతాధికారులు నర్సింగ్రావు, స్మితా సభర్వాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆస్తులను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను మున్సిపల్ అధికారులు జిల్లా, మండల, గ్రామ పంచాయతీ అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి డీపీవోలు ఎంపీవోలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రజల తమ ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి అధికారులకు పూర్తి వివరాలు అందించాలని కోరారు. భూ రికార్డుల నిర్వహణ నూటికి నూరు శాతం పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ధరణి పోర్టల్కు శ్రీకారం చుడుతున్నట్లు స్పష్టం చేశారు. ఆస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియతో పాటు గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణం, డంప్ యార్డుల ఏర్పాటు, ప్రతీ ఇంటికీ 6 మొక్కలు ఇవ్వడం, గ్రామాల్లో హరితహారం కార్యక్రమం, గ్రామ పంచాయతీలకు కొనుగోలు చేసిన ట్రాక్టర్ల ద్వారా ఇండ్ల నుంచి గ్రామాలలో చెత్తను ఎలా తరలిస్తున్నారనే అంశంపై ఆకస్మి తనిఖీలు చేయడానికి ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు.