సూర్యాపేట, సెప్టెంబర్ 10, ప్రజాతంత్ర ప్రతినిధి): 2020,21 సంవత్సరానికి జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 3448.14కోట్ల రూపాయలను జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి గురువారం విడుదల చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బ్యాంకర్లు, జిల్లా గ్రామీణాభివృద్ది, ఎస్సీ,బిసి కార్పొరేషన్, వ్యవసాయ, పశుసంవర్దక, మత్స్యశాఖ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులతో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ డిఎల్ఆర్సి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు విడుదల చేసిన వార్షిక రుణ ప్రణాళికపై మాట్లాడుతు ప్రతిశాఖ బాధ్యతగా పనిచేసి జిల్లాను ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. పంట రుణాలకు 2010.26కోట్లు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2607.06కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు 633.26కోట్లు, జిల్లాలోని 12958స్వయం సహాయక బృందాలకు 347.39కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను అందించనున్నట్లు తెలిపారు. బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యం మేరకు లబ్దిదారులకు సకాలంలో రుణాలు అందించాలని పేర్కొన్నారు.
అనంతరం ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ పథకం కింద వివిధ సంక్షేమ శాఖల ద్వారా మంజూరైన రుణాలను బ్యాంకుల వారిగా సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందే విధంగా చూడాలని అన్నారు. 13751వీధి వర్తకులకు రుణాలు అందించే లక్ష్యంలో ఇప్పటివరకు 3692మంది వర్తకులకు 369.20లక్షల రూపాయల వివిధ బ్యాంకుల ద్వారా మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా 5272మంది లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు పంపగా 3527మందికి రుణాలు మంజూరు అయ్యాయని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పద్మజరాణి, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి కిరణ్, జగదీష్ చంద్రబోస్, జ్యోతిర్మయి, వేణుమనోహర్, శిరీష, శ్రీనివాస్, సౌజన్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.