Take a fresh look at your lifestyle.

‌ప్రజా సంక్షేమం లక్ష్యంగా బడ్జెట్‌

  • ‌సంక్షేమ పథకాల క్యాలెండర్‌ ‌విడుదల
  • అసెంబ్లీలో బడ్జెట్‌కు సభ ఆమోదం
  • అసెంబ్లీలో వెల్లడించిన సిఎం జగన్‌

అమరావతి, మార్చి 25 :  తమది ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లు అంకెల గారడీ బడ్జెట్‌ ‌కాదని, గత మూడేళ్లుగా ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే మంచి బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల ముగింపు  సందర్భంగా.. ద్రవ్యవినిమయ బిల్లుపై ఆయన సమాధానం ఇచ్చారు. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా.. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను స్వయంగా చదివి వినిపించిన అనంతరం సీఎం జగన్‌ ‌మాట్లాడారు. ఇది పేద వర్గాలకు వెల్‌ఫేర్‌ ‌క్యాలెండర్‌ అని.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, ఆయనకు ఢంకా బజాయించే డియాకు ఏమాత్రం రుచించని క్యాలెండర్‌ అని, ఒకరకంగా గుబులు పుట్టించే క్యాలెండర్‌ అని వైఎస్‌ ‌జగన్‌ ‌చమత్కరించారు. పైగా ఇది చంద్రబాబుకు ఫేర్‌వెల్‌ ‌క్యాలెండర్‌ అవుతుందని చెప్పారు సీఎం వైఎస్‌ ‌జగన్‌. ‌

కరోనా లాంటి సమయంలోనూ.. ప్రజలకు సంక్షేమ ఫలాలు ఎక్కడా ఆగలేదని గుర్తు చేశారు సీఎం జగన్‌. ఎక్కడా కులం, మతం, ప్రాంతం, పార్టీలు కూడా చూడకుండా అందరూ మనవాళ్లే, అందరూ నా వాళ్లే అని నమ్మి ఈ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలు.. ఎప్పుడు, ఏ నెలలో అమలు చేస్తున్నామో సందేహాలకు తావు లేకుండా ముందుకెళ్తున్నామని అన్నారాయన. పైగా లబ్దిదారులు ప్లాన్‌ ‌చేసుకునేందుకు వీలుగానే కాకుండా.. పారదర్శకంగా, అవినీతి, వివక్షకు లేకుండా ఏ నెలలో ఏ స్కీమ్‌ ‌వస్తుందో చెబుతూ క్రమం తప్పకుండా అమలు చేస్తూ..  భరోసా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని సీఎం వైఎస్‌జగన్‌ అన్నారు. మంచి బడ్జెట్‌.. ‌దేవుడి దయ.. ప్రజలందరి చల్లని దీవెనలు ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు చెబుతూ ప్రసంగం ముగించారు.

అనంతరం జనరంజకమైన ఆంధప్రదేశ్‌ ‌బడ్జెట్‌ 2022-23‌ని రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం ఆమోదించిన స్పీకర్‌.. ‌సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. విపక్ష సభ్యుల సస్పెన్షన్లు, హాట్‌ ‌హాట్‌ ‌డిస్కషన్లు.. వాయిదాల ద వాయిదాలతో అసెంబ్లీ  సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. జనరంజక బడ్జె  తీసుకువచ్చారంటూ స్పీకర్‌ ‌రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. సభ్యులు వివిధ ప్రజాసమస్యలు ప్రస్తావించారని, ప్రభుత్వం బాధ్యతగా వాటన్నింటికీ సమాధానం చెప్పిందని వివరించారు. ప్రజల కోసం తీసుకువచ్చిన అద్భుతమైన చట్టాలకు సమావేశాల్లో ఆమోదం లభించిందని, చట్టాలను ఆమోదించడంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని స్పీకర్‌ ‌తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అటు, ఏపీ శాసనమండలి కూడా నిరవధికంగా వాయిదా పడింది.

ఇదిలా వుంటే విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, సస్పెన్షన్లతోనే సభ నడిచిందని ప్రతిపక్షం మండిపడింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా 2022?23 బడ్జెట్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ ‌జగన్‌ ‌శాసనసభలో మాట్లాడారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన క్యాలెండర్‌ను శాసనసభ సాక్షిగా సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌విడుదల చేశారు. సంక్షేమ పథకాల అమలు ఎలా జరుగుతుందో.. రాష్ట్రంలోని ప్రతి రైతన్నను అడిగినా, స్కూల్‌ ‌పిల్లవాడిని, పాపను, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను ఎవరిని అడిగినా చెబుతారని, సంతోషం వారి కళ్లల్లోనే కనిపిస్తుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల క్యాలెండర్‌ ‌పేదలకు వెల్ఫేర్‌ ‌క్యాలెండర్‌ అయితే.. చంద్రబాబు ఫేర్వెల్‌ ‌క్యాలెండర్‌ అవుతుందన్నారు. విపక్షం వ్యవహరించిన తీరుపై జగన్‌ ‌మండిపడ్డారు.

ఏప్రిల్‌ 2022-2023 ‌మార్చి సంక్షేమ పథకాల క్యాలెండర్‌
2022.. ఏ‌ప్రిల్‌లో వసతి దీవెన, వడ్డీలేని రుణాలు, మేలో విద్యా దీవెన, అగ్రి కల్చర్‌ ఇన్సూరెన్స్, ‌రైతు భరోసా, మత్య్సకార భరోసా, జూన్‌లో అమ్మ ఒడి పథకం, జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు, ఆగష్టులో విద్యా దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెన్‌టివ్‌, ‌నేతన్న నేస్తం, సెప్టెంబర్‌ ‌లో వైఎస్సార్‌ ‌చేయూత,అక్టోబర్‌లో వసతి దీవెన, రైతు భరోసా, నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు, డిసెంబర్‌లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు, 2023.. జనవరిలో రైతు భరోసా, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు పథకాలు, ఫిబ్రవరిలో విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలు మార్చిలో వసతి దీవెన అమలు కార్యక్రమాలు ఉంటాయని ప్రకటించారు.

Leave a Reply