- రైతులకు కేంద్రం ఒక్క మంచి పనైనా చేసిందా..?
- వడ్ల కొనుగోలు ఆలస్యం చేసే కుట్రతోనే 2900 మిల్లుల తనిఖీలు
- రైతుల నుండి ధాన్యం కొనుగోలు తర్వాతే ఎఫ్సిఐ తనిఖీలు చేపట్టాలి
- కేంద్రంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు ఫైర్
సిద్ధిపేట, మే 5(ప్రజాతంత్ర బ్యూరో) : రైతులకు కేంద్రం చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉందా? తనిఖీల పేరుతో మిల్లర్లు వడ్లు కొనుగోలు చేయకుండా చేస్తున్నారనీ, తెలంగాణ సర్కార్కు మంచి పేరు రాకుండా కేంద్రం కుట్రలు చేస్తుందనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు విమర్శించారు. మిల్లుల ముందుకు లారీలతో ధాన్యం వొచ్చాక ఎఫ్సిఐ అధికారులు మిల్లులో కూర్చోని ఇబ్బంది పెడుతున్నారనీ, రైతులను ఇబ్బందులకు గురిచేయడం కేంద్రానికి తగదని ఫైర్ అయ్యారు. ఎఫ్సిఐ అధికారుల తనిఖీలు చేయొద్దనీ తాము అనడం లేదనీ, ధాన్యం కొనుగోలు చేసే వరకు తనిఖీలను విరమించుకోవాలన్నారు. గురువారం సిద్ధిపేటలోని మార్కెట్ యార్డును సందర్శించిన అనంతరం మంత్రి హరీష్రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ….అకాల వర్షాలతో చాలా చోట్ల వరిధాన్యం తడిసిపోయిందని, తడిసిన ధాన్యం ఆరబెట్టి మిల్లర్లతో కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించడం జరిగిందన్నారు.
దేశంలో ఎక్కడైనా పండిన పంట కొనే వ్యవస్థ ఉంది. కానీ, తెలంగాణ వడ్లు కొనమని మొట్టమొదటిసారి కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం మొండికేసి తొండాట ఆడుతుందనీ, రా రైస్ కొంటం, బాయిల్డ్ రైస్ కొనం అన్నరు. వేసవిలో తెలంగాణలో బాయిల్డ్ రైస్ మాత్రమే వొస్తుంది. అయినా, 3 వేల కోట్ల రూపాయల భారం వహించి రైతులను కాపాడాలని, రైతులకు మద్ధతు ధర కావాలని సిఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. కానీ, కక్ష్య కట్టిన కేంద్ర ప్రభుత్వం రైతుల నుండి వడ్లు కొనుగోలు చేసే సమయంలో 2900 రైస్ మిల్లుల దాడులు చేయిస్తుందనీ, ఒక నెల ఆగి దాడులు చేస్తే ఎమవుతుందనీ మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. రైతులు నష్టపోవాలి. వడ్లు కొనవద్దన్న కారణంతో ఎఫ్సిఐ అధికారులతో దాడులు చేయిస్తుందనీ మండిపడ్డారు.
మిల్లు యాజామాన్యాలను తమ ఆధీనంలో ఉంచుకుని సీజ్ చేస్తున్నారనీ, లారీలలో వడ్లు మిల్లుకు వెళ్తే దించే పరిస్థితి లేదన్నారు. మేం తనిఖీలు చేయవద్దని అనడం లేదు. ఒక్క నెల అయితే మా ధాన్యం కొనుగోలు పూర్తవుతుందన్నారు. వడ్లు కొనుగోలు చేయకపోతే తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలి. రైతుల వడ్లు కొనవద్దని చూస్తున్నారనీ, కుట్రతో కేంద్రం వ్యవహరిస్తుంది. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులందరూ కేంద్రం కుట్రలను గమనించాలన్నారు. రైసు మిల్లులపై ఎఫ్సిఐ అధికారులు దాడులు చేయడం వల్ల రైతులకు ఇబ్బందులవుతున్నాయన్నారు. వడ్లు కొనమని తొండాట ఆడారు. కొనకపోతే తెలంగాణకు చెడ్డ పేరు రావాలని చూశారు. కేసీఆర్ 3 వేల కోట్లతో కొనాలని నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు రైతులు మిల్లర్ల వద్ద ధాన్యం దింపకుండా ఉండేలా చేస్తుంది.
తడిస్తే రైతులు ఇబ్బంది పడేలా, తెలంగాణ ప్రభుత్వంపై కోపం వొచ్చేలా కుట్రలు చేస్తుందన్నారు. బాయిలకాడ మీటర్లు పెట్టాలంటున్నారు. డీజిల్ ధరలు పెంచారు. ఎరువుల ధరలు పెంచారు. ట్రాక్టర్తో దున్నడానికి ఎకరానికి 5 వేల రూపాయల ఖర్చవుతుందన్నారు. వరి కోత మిషన్తో పని ఇవాళ 2 వేల రూపాయలు దాటిందన్నారు. సిద్ధిపేట జిల్లాలో తడిసిన ధాన్యాన్ని స్వయంగా అన్ని మార్కెట్లకు వెళ్లి చూడటం జరిగిందనీ, మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం ఆరబెట్టే విధంగా చర్యలు తీసుకున్నామనీ, సిద్దిపేటలో పండిన పంట అంతా కొనే విధంగా 600 ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు చేశామన్నారు.
421 సెంటర్లు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందనీ, చాలా చోట్ల సెంటర్లలో కొనుగోలు ప్రారంభమైందనీ, 4 వేల టార్పాలిన్ కవర్లు ఒక్క సిద్ధిపేటలో కొనుగోలు చేయడం జరిగిందనీ, ఎక్కడా ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. రైతులు ప్రభుత్వంతో సహకరించి కళ్లంలోనే ఆరబెట్టి ధాన్యం తెస్తే, ఆదే రోజు కొనడానికి అవకాశం ఉంటుందనీ, అలా ఆరబెట్టకుండా మార్కెట్ యార్డుకు, ఐకెపి సెంటర్లకు తెస్తే వర్షానికి తడిసిపోతున్నాయనీ, లోతట్టు ప్రాంతంలో ఆరబొస్తే అకాల వర్షం వల్ల ధాన్యం తడుస్తుందన్నారు. మంత్రి వెంట జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఏఎంసి ఛైర్మన్ పాల సాయిరాం, టిఆర్ఎస్ నేతలు వేలేటి రాధాకృష్ణశర్మ, కొండం సంపత్రెడ్డి ఉన్నారు. మార్కెట్ యార్డు సందర్శనలో భాగంగా పలువురు రైతులతో మంత్రి హరీష్రావు మాట్లాడారు.