మహబూబ్నగర్, 29 మే( ప్రజాతంత్ర ప్రతినిధి) : మహిళా మణులు అన్ని రంగాలలో రాణించి అభివృద్ధి చెందాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు పాలమూరు జిల్లా స్వయం సహాయక సంఘం మహిళలు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలు – డ్వాక్రా ఎగ్జిబిషన్ను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్ రావు తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్. శుక్రవారం స్థానిక సుదర్శన్ కన్వెన్షన్ హాల్ నందు ఎగ్జిబిషన్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి స్టాళ్లను తిరిగి పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుందని, మహిళలను చైతన్యపరిచి వారు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం చాలా అవసరమని, తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయు విధానం తెలిసి ఉండాలి, మార్కెటింగ్ ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహించాలని, త్వరలోనే మహబూబ్నగర్ లో వెయ్యి ఎకరాల స్థలంలో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, మహిళా సంఘం సభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టి మంచి మంచి ఉత్పత్తులను తయారు చేయాలని, ఫుడ్ పార్కులో మీరు తయారు చేసిన వాటిని మార్కెటింగ్ చేయుటకు స్థలం కేటాయిస్తామమని, ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకో వాలని, మహబూబ్నగర్ జిల్లాకు మంచి రోజులు వచ్చా యని, మహిళా సంఘాల సభ్యులు కష్టపడి పని చేసి ముందుకెళ్లాలని మంత్రి సూచించారు.
ఆర్గానిక్ ఫుడ్ సెంటర్ ను ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించిన మంత్రి. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ‘‘మహా’’ (మహబూబ్ నగర్ మహిళా ప్రొడక్టస్) పేరును నామకరణం చేసి లోగోను ఆవిష్కరించిన అనంతరం పాలమూరు జిల్లా సమాఖ్య మహిళా సంఘాలకు మంత్రి అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు మాట్లాడుతూ మన జిల్లా వరకే పరిమితం చేయకుండా ప్రపంచానికి పరిచయం చేసే కృషిచేసి అభివృద్ధి చెందాలని, కరోనా సమయంలో మనమే ముందుగా మాస్క్ లను తయారు చేసి అందుబాటులోకి తేవడం జరిగిందని కలెక్టర్ అన్నారు. మామిడి ఒరుగు చేసిన విధంగానే రాబోయే సీజన్లో సీతాఫలం యూనిట్లను హన్వాడ, గండీడ్, నవాబుపేట్ మండలాల్లో ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, మహిళా సంఘాలకు జిల్లా కలెక్టర్ సూచించారు.అనంతరం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లా ఎప్పుడు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని మహిళలు కూడా అన్ని రంగాల్లో తమ ఏదైనా గుర్తింపు తెచ్చుకున్నారని, పురుషులకు సమానంగా పనిచేస్తున్నారని, మహిళా సంఘ సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా పరిచయం కావాలని, కాబట్టి మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి.నర్సిములు, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, డిఆర్డీఏ పిడి వెంకట్ రెడ్డి, బ్యాంక్ మేనేజరులు, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగరాజు కుమార్, సంబంధిత అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.