జోగినిపల్లి సంతోష్ కుమార్ తెలంగాణ వాదులకు, తెలంగాణ వాసులకు పరిచయం అక్కర్లేని పేరు. టిఆర్ఎస్ ఆవిర్భావం ముందునుంచే ఉద్యమనేత కేసీఆర్ వెంట నడిచారు. సంతోష్ పేరుకు తగ్గట్టుగా ఎల్లప్పుడూ సంతోషంగా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ పార్టీలో వివాదరహితుడిగా ఉంటూ అంచెలంచెలుగా పార్టీ శ్రేణులు అందరికీ అప్తుడు గా, అన్నగా, సంతన్న గా దగ్గరయ్యాడు. ఉద్యమకాలంలో టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అప్పగించిన ప్రతి బాధ్యతను విజయవంతంగా పూర్తి చేశారు.
2001 ఏప్రిల్ 27 జలదృశ్యంలో కెసిఆర్గారు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి, టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని భుజానికెత్తుకుని తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించిన రోజు… మంచి ఎండాకాలం. కెసిఆర్గారు చింతమడక వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని, నాంపల్లి దర్గాలో ప్రార్థనలు చేసి, గన్ పార్కులో అమరవీరులకు నివాళులు అర్పించి జలదృశ్యంనకు చేరుకున్న సందర్భం. వేలాదిగా వచ్చిన వారిలో ప్రముఖులను గుర్తించి సభా వేదిక వైపు తీసుకెళ్లడం, మీడియా మిత్రులను సమన్వయం చేయడం, వేసవి ఎండలో వచ్చిన వారికి మంచినీళ్లు అందించడం చేసి ఉద్యమానికి ఊతం ఇవ్వడానికి ఎలాంటి భేషజాలు లేకుండా ఉండాలని అధినేత అప్పగించిన పనిని చేసుకుంటూ పోవడమే తన శైలి అని నిరూపించాడు సంతన్న.
ఆ రోజుల్లో సంతోష్ అతి కొద్దిమందికే పరిచయం. కానీ ఉద్యమ ప్రస్థానంలో అందరితో చక్కని అనుబంధము పెంచుకుని ఎంత ఒత్తిడి లోనైనా ఒద్దికగా ఓపికగా వ్యవహరిస్తూ అందరికీ తలలో నాలుకలా వ్యవహరించడం కలుపుగోలుగా వ్యవహరిస్తూ చిన్నా పెద్దా భేదభావం లేకుండా అందరినీ అన్న అంటూ ఆప్యాయంగా పలకరించడం ఆయన శైలి. అధినేతకు అగ్ర నాయకత్వానికి ఎంత సన్నిహితుడైన ఏమాత్రం గర్వ•ం చూపించకుండా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ కావాల్సిన సహాయం చేయడంలో ముందు ఉండటం ఆయనకున్న గుణం. ఉద్యమ నేత కెసిఆర్ తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను సొంతంగా పూర్తి చేశారు. కెసిఆర్ కరీంనగర్ నుండి ఆమరణ దీక్షకు బయలుదేరిన సందర్భం నుండి దీక్ష విరమించేంతవరకు.. లక్ష్యాన్ని సాధించే వరకు అధినేతతో అనుక్షణం ఉన్నారు. అధినేత వ్యక్తిగత విషయాలతో పాటు పార్టీ కార్యకర్తలకు నాయకులకు వివిధ సంఘాల జేఏసీ నాయకులకు సమన్వయకర్తగా వ్యవహరించిన సంతన్న ఎవరితోనైనా కొత్త పరిచయం చేసుకోవలసి వస్తే కెసిఆర్ పిఏగా మాత్రం చెప్పుకునేవారు. తెలంగాణ గుండె చప్పుడు టీ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉన్నా కూడా ప్రతి చిన్న విలేకరి అయినా, మండల స్థాయి రిపోర్టర్ అయినా సౌమ్యంగా మాట్లాడేవాడు. ఎన్ని క్లిష్ట సందర్భాలు వచ్చినా, సమస్య ఎంత సంక్లిష్టమైనా ఓపికగా వినయంగా నిలబడే వ్యక్తి కాబట్ట్టే సీమాంధ్ర మీడియాను తట్టుకొని టీ న్యూస్ తెలంగాణలో నంబర్ వన్గా నిలిచింది. టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనప్పటి నుంచి పార్టీలో సీనియర్ నేతల నుంచి క్రింది స్థాయి కార్యకర్తల వరకు ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చి నిలబడ్డారు.
ఆయన శ్రమను గుర్తించిన టిఆర్ఎస్ అధినేత 2018 మార్చిలో సంతన్న ను రాజ్యసభకు ఎంపిక చేసినప్పుడు పార్టీ శ్రేణులన్నీ సంతోషించాయి. తమకు ఏ అవసరం వచ్చినా చెప్పుకోవడానికి అండగా ఉండే సంతన్న కు పదవి దక్కడం పట్ల పార్టీ కార్యకర్తలు ఎంతో ఆనంద పడ్డారు. ఏ పదవి వచ్చిన తన కాళ్ళు భూమిమీదనే ఉన్నాయని ఉద్యమ సమయంలో కానీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కానీ ఎవరితో ఎలా ఉన్నాడో రాజ్యసభ సభ్యుడిగా అయిన తర్వాత కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అనే సూత్రాన్ని పాటిస్తున్నారు.
పార్టీలకు ఎల్లప్పుడూ రాజకీయాలే కాదు సామాజిక బాధ్యత ఉండాలనే సంకల్పంతో పర్యావరణ వాతావరణ పరిస్థితులను మెరుగుపరచడానికి పార్టీ శ్రేణులను మిత్రులను సన్నిహితులను అందరినీ కదిలిస్తూ పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించిన సంతన్న కార్యక్రమం దేశవ్యాప్తంగా పలువురి ప్రశంసలు అందుకుంది. పదవిని పదిమంది ప్రయోజనానికి ఉపయోగుస్తుండే• జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆశయానికి ప్రకృతి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి.
– సురేష్ కాలేరు
(రాజ్యసభ సభ్యుడిగా సంతోష్ అన్న మూడేళ్లు పూర్తి అయిన సందర్భంగా..)