రాష్ట్రానికి ఐపిఎస్ల సంఖ్యను పెంచాలని వినతి
పలు అంశాలపై హోమ్ మంత్రితో చర్చ
రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను సీఎం కేసీఆర్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం అమిత్ షాను కలిశారు. శుక్రవారం ప్రధాని మోడీని కలిసిన సిఎం కెసిఆర్ అమిత్షాతో కూడా పలు అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వినతులు చేయడంతో పాటు పలు అంశాలను ఆయన దృష్టికి తెచ్చారు. రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల తర్వాత జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగిందని, దాంతో కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీజోన్లు ఏర్పడ్డాయని, దానికి తగినట్లే పోలీసు శాఖలోనూ మార్పులు జరిగాయన్నారు. అయితే పోలీసు శాఖలో ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. పోలీసు శాఖలో జరిగిన మార్పుల వల్ల సీనియర్ డ్యూటీ పోస్టుల సంఖ్య 75 నుంచి 105కు పెరిగిందని, ఇక ఐపీఎస్ కేడర్ పోస్టుల సంఖ్య కూడా 139 నుంచి 195కు పెరిగాయని సీఎం కేసీఆర్ ఓ లేఖలో కేంద్ర హోమ్ శాఖ మంత్రికి తెలిపారు.
ఈ నేపథ్యంలో పటిష్టమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు, పరిపాలనా నిర్వహణకు అనుగుణ మైన రీతిలో ఐపీఎస్ల సంఖ్యను పెంచాలని సీఎం కేసీఆర్ కోరారు. పోలీసు ఆఫీసర్లకు సంబంధించిన అంశాన్ని కేంద్ర హోంశాఖకు తెలియజేశానని, కొత్త కమిషనర్లు, డీఐజీలు, ఎస్పీలు, ఐజీపీల అవసరం ఉందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అవసరాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి, ఐపీఎస్ క్యాడర్ సవి•క్ష నిర్వహించాలని, తద్వారా అవసరమైన ఆఫీసర్లను కేటాయించాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. కొత్తగా 29 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటుగా మొత్తం 195 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు.