ప్రతి నల్ల మబ్బుకూ ఓ జలతారు అంచు
వ్యవసాయ ఆదాయాన్ని క్రమేణా స్ధిరీకరించడానికి, విపత్తుల వల్ల పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం నుంచి రైతును ఆదుకోవడంతోపాటు వారి రుణపరపతి మెరుగు కోసం ప్రభుత్వాలు పంటల బీమాను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే పంటల బీమా పథకాలకు రుసుము ముందస్తు మంజూరుతోపాటు క్లెయిమ్ హక్కును బీమాదారులకు వదిలివేయడం వల్ల ప్రభుత్వ బడ్జెట్లు ఏళ్లపాటు సజావుగా సాగిపోతాయి. భారతదేశంలో వ్యవసాయ రంగానికి కరువులు, వరదలవంటి ప్రకృతి విపత్తులు ముప్పు కలిగించేవిగానే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వంతోపాటు రైతులపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించగల (పంటల బీమా వంటి) ఆర్థిక వెసులుబాట్లు కీలకపాత్ర పోషిస్తాయి. విపత్కర పరిస్థితులు అనేకమంది రైతులను కష్టాల్లోకి నెడతాయి. అలాంటి సమయాల్లో పంటల బీమా తోడ్పాటు లేకపోతే ఆదాయ నష్టానికి దారితీయడమేగాక రుణాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడుతుంది. ఈ దుర్భర పరిస్థితులు కొన్ని సందర్భాల్లో రైతు ఆత్మహత్యకు దారితీస్తుంటాయి.
దేశంలో 1970 దశకం నుంచి అమలులో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలకు, పంటలకు మాత్రమే పరిమితమైన పంటల బీమా మరింత సమగ్రం, విస్తృతం అవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సమస్యలను పరిష్కరించగల అత్యంత సమగ్ర, సమర్థపంటల బీమాపథకం రూపకల్పనపై ప్రభుత్వం వివిధ భాగస్వాములతో సంప్రదించి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2016లో అమలులోగల సబ్సిడీ అభ్యర్థన నమూనాల స్థానంలో ‘‘ప్రధానమంత్రి పంటల బీమా పథకం’’ (పీఎ ంఎఫ్బీవై) అమలులోకి వచ్చింది. రైతులకు ప్రమాదకర, అనిశ్చిత పరిస్థితులు ఎదురైనపుడు కొంత స్థాయివరకూ భద్రత కల్పించే అనేక ప్రభుత్వ పథకాలలో కార్యక్రమాలలో ‘పీఎంఎఫ్బీవై’ కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఏటా రుసుములపై సబ్సిడీ కింద కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా భాగస్వాములలో అసంతృప్తి తొలగడం లేదు. అన్నివిధాలా సుస్పష్ట పంటల బీమా పథకం ఒక్కటీ లేని పరిస్థితుల్లో ‘పీఎంఎఫ్బీవై’ కూడా ఇందుకు అతీతం కాదన్న విమర్శ వచ్చింది. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు.. కానీ, విమర్శలన్నీ నిజాలు కావు. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఒకటుంది. అదేమిటంటే- పథకం అమలుపై ప్రభుత్వం క్రమబద్ధ రీతిలో అభిప్రాయ సేకరణ చేపట్టింది. తదను గుణంగా అసంతృప్తికి కారణమయ్యే కీలకాంశాల్లో అవసరమైన మార్పులు చేస్తూ వస్తోంది. ఇదొక నిరంతర ప్రక్రియ.. కాగా- కొన్ని రాష్ట్రాలు, భాగస్వాములు ఈ పథకం నుంచి వైదొలిగాయి. అయిన ప్పటికీ ఈ పథకం సాధించిన విజయం అసాధారణమైనదనే చెప్పాలి.
ఈ విజయం ఎలాంటిదో పాఠకులు అర్థం చేసుకోవడం కోసం కొన్ని ముఖ్యాంశాలను దిగువన ఉటంకిస్తున్నాను:
రక్షణ విలువ: ‘పీఎంఎఫ్బీవై’కి ముందు కాలంలో హెక్టారుకు సగటు బీమా మొత్తం రూ. 16,388 కాగా, 2020-21 నాటికి ఇది రూ.44,829కి పెరిగడంతో తగుమేర బీమా రక్షణ లభిస్తోంది. జాతీయ పంటల బీమా పోర్టల్ (ఎన్సీఐపీ): కేంద్ర ప్రభుత్వంతో అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలుసహా భాగస్వామ్య బీమా కంపెనీలు, 1,70,000 బ్యాంకు శాఖలు, 44,000 సార్వత్రిక సేవా కేంద్రాల (సీఎస్సీ) నెట్వర్కును అనుసంధానిస్తూ కేంద్రీకృత ఐటీ వేదిక రూపొందించబడింది. దీనిద్వారా రుణం పొందని రైతుల నమోదు, అందరు భాగస్వాముల మధ్య మెరుగైన పాలన-సమన్వయ సౌలభ్యం ఏర్పడింది. ‘పీఎంఎఫ్బీవై’కి ముందు కాలంలో రైతులు తమ పేరు నమోదు కోసం బ్యాంకు శాఖలవద్ద తెగబారెడు వరుసల్లో గంటలపాటు ఎదురుచూడాల్సి వచ్చేది. దీంతోపాటు అనేకసార్లు బ్యాంకుల చుట్టూ తిప్పట తప్పేది కాదు. ఈ పోర్టల్ వల్ల ఇప్పుడు అంతా సులభమైపోగా, ఎలాంటి అవస్థలూ లేవు.
మరోవైపు పంట దిగుబడి అంచనా కోసం నమూనా పంటకోత ఫలితాల అంచనా (సీసీఈ), తనిఖీ నిమిత్తం ‘సీసీఈ’ అనువర్తనంతోపాటు అత్యాధునిక నమూనా పద్ధతులు వినియోగించబడుతున్నాయి. దీనివల్ల ‘సీసీఈ’ నమూనాల సంఖ్య తగ్గడమేగాక పంట దిగుబడి అంచనా సులువవుతుంది.రైతు ఖాతాకు నేరుగా జమ: ‘పీఎంఎఫ్బీవై’ కింద క్లెయిములపై సొమ్ము నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. బీమా తీసుకున్న రైతులందరిలో సగటున 1/3వ వంతు పరిహారం పొందుతుండగా, ఈ కార్యకలాపాలు భారీస్థాయిలో సమర్థంగా సాగుతున్నాయి. దీంతో రైతులకు పరిహారం సత్వరమే అందటంతోపాటు అక్రమాలకు తావుండదు. మొత్తంమీద క్లెయిముల నిష్పత్తి: దేశవ్యాప్తంగా 2016-17 నుంచి 2019-20 మధ్య క్లెయిముల నిష్పత్తి 88.6 శాతంగా ఉంది. ఏ విధంగా చూసినా ఇది తక్కువేమీ కాదు. దీనికి బీమా సంస్థలు, పునఃబీమా సంస్థల అదనపు వ్యయాన్ని కూడా జోడిస్తే పరిశ్రమ దాదాపు 100 శాతం మిశ్రమ నిష్పత్తి కలిగి ఉంది. మొత్తంమీద 88.6 శాతం స్థూల క్లెయిముల నిష్పత్తి రైతుల ప్రీమియం వాటాకు 540 శాతంగా ఉంటుంది.కీలక విపత్తులలో పరిహారం: దేశంలో 2016 నుంచి దాదాపు ప్రతి రాష్ట్రం ఏటా కనీసం ఒక్కసారి వాతావరణ ప్రతికూలతను ఎదుర్కొం టూనే ఉంది. ఇలాంటి విపత్తుల సమయంలో రైతులకు తగిన పరిహారం లభించింది. ఆ మేరకు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లో అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రైతులకు రక్షణలో ఈ పథకం సమర్థతే దాని విలువను స్పష్టం చేస్తోంది. నష్టాలకు సకాలంలో చెల్లింపు: బీమా కీలక లక్షణం సకాలంలో చెల్లింపు. ఈ మేరకు సకాలంలో క్లెయిముల పరిశీలన-పరిష్కారం (సబ్సిడీలకు లోబడి) దిశగా ‘పీఎంఎఫ్బీవై’ మార్గదర్శకాల్లో ఆలస్యానికి జరిమానా విధింపు నిర్దేశించబడింది. ఇది అనుకున్నంత కచ్చితంగా లేనప్పటికీ సమయ పాలన మెరుగుపడింది.
ఇండెక్స్ ‘ప్లస్’ బీమా: ‘పీఎంఎఫ్బీవై’ కింద దిగుబడి సూచీ, బీమాకు హామీ రెండూ సమ్మిళితంగా ఉంటాయి. విస్తృత విపత్తులకు దిగుబడి సూచీ వర్తిస్తుంది. అలాగే వ్యక్తిగత వ్యవసాయ నష్టం అంచనాలు స్థానిక విపత్తులకు వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా చెదురుమదురు సంఘటనలవల్ల వాటిల్లే నష్టాలను కూడా ‘పీఎంఎఫ్బీవై’ పరిగణనలోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దింది. మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో స్థానిక విపత్తులకు ఈ పథకం ద్వారా పరిహారం లభించడం ఇందుకు నిదర్శనం.ఈ అంశాలన్నిటి నేపథ్యంలో ‘పీఎం ఎఫ్బీవై’ ఆసాంతం చక్కగా ఉందని చెప్పలేం. ఎందుకంటే- కేంద్ర ప్రభుత్వం పరిస్థితులపై ఎప్పటికప్పుడు అభిప్రాయ సేకరణతో తగువిధంగా మార్పుచేర్పులు చేస్తున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో (i) కొన్ని పంటలకు అధిక ప్రీమియం వసూలు (ii) కేంద్ర ప్రభుత్వ వాటాపై ప్రీమియం సబ్సిడీకి పరిమితితో తమకు ఆర్థిక భారం పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధిక ప్రీమియం వసూలు చేస్తున్నందున సాధారణ పంట సంవత్సరాలకు సంబంధించి కొంత భాగం ప్రీమియం వాపసు కోసం కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.
పైన పేర్కొన్న ఆందోళనకు ఓ పరిష్కారం ఆలోచించవచ్చు… ఈ మేరకు (i) కనిష్ఠ దిగుబడి గణన పద్ధతి మార్పు (ii) సాంకేతికత ఆధారిత దిగుబడులకు ఎక్కువ ప్రాధాన్యం (iii) రాష్ట్రాలు, బీమా సంస్థల మధ్య లాభాల సముచిత పంపిణీకి ఒక యంత్రాంగం ఏర్పాటు వంటి మార్గాలను అనుసరించవచ్చు. కనిష్ఠ దిగుబడి గణన సగటు దిగుబడిపై ఆధారపడి ఉంటుంది..
ఇది ప్రస్తుతం గడచిన ఏడేళ్ల సగటు దిగుబడిలో రెండు అత్యల్ప దిగుబడులను తొలగించిన తర్వాత తేలే దిగుబడిగా ఉంటుంది. అయితే, ఒక అత్యధిక దిగుబడి, ఒక అత్యల్ప దిగుబడి (ఒలింపిక్ సగటు) మినహాయించడం ద్వారా ఈ పద్ధతిలో మరింత సమతౌల్య గణనను ప్రవేశపెట్టవచ్చు. ఈ గణన పద్ధతిని గుజరాత్లో ప్రధాన ఖరీఫ్ పంటలకు వర్తింపజేస్తే ప్రీమియం రేట్లు దాదాపు 20 శాతం పడిపోతున్నాయి. పంట తుది దిగుబడిని ప్రస్తుతం చేతికోత ప్రయోగాల ద్వారా మాత్రమే నిర్ణయిస్తున్నారు. అయితే, సాంకేతిక పద్ధతులద్వారా లభించే తుది దిగుబడుల గణనలో సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు అనుభవం పెరిగేకొద్దీ దిగుబడులు పెరుగుతాయి కాబట్టి తక్కువ వెయిటేజీ (ఉదా? 20శాతం)తో ప్రారంభించాలి. కొన్ని నష్ట నిష్పత్తుల పరిధిలో లాభం/నష్టం పంపిణీ ఎలా ఉంటుందో అమెరికా, దక్షిణ కొరియాల ఉదాహరణలు వివరిస్తాయి. ఈ నమూనా వినియోగం ద్వారా మనం ప్రభుత్వ- బీమా సంస్థల యాజమాన్యాన్ని విస్తృతస్థాయి నష్ట నిష్పత్తులలో నిర్వహించగలం. ఉదాహరణకు? నష్ట నిష్పత్తి 50 శాతంకన్నా తక్కువగా ఉంటే మిగులును ప్రభుత్వానికి, బీమా సంస్థకు మధ్య విభజించవచ్చు. దీనివల్ల ప్రభుత్వానికి పెద్ద వాటా వెళ్తుంది. అయితే, మార్జిన్ తగ్గింపు ద్వారా నష్ట నిష్పత్తి పెరగడంవల్ల క్రమంగా బీమా సంస్థకు పెద్ద వాటా బదిలీ అవుతుంది. నష్టాలు (ఉదాహరణకు 150 శాతంకన్నా) ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎక్కువ నష్టాన్ని భరించాల్సి రావచ్చు. అయితే, నష్ట నిష్పత్తి తగ్గినప్పుడు బీమా సంస్థలు మరింత నష్టపోతాయి.మొత్తంమీద ‘పీఎంబీఎఫ్వై’ ఫలితాలు ఇప్పటిదాకా ఆశాజనకంగానే ఉన్నప్పటికీ మరింత మెరుగుపరచడం ద్వారా పంట వైఫల్యాలను, వాతావరణ ముప్పుల నిర్వహణలో ఇదొక ముఖ్యమైన ఉపకరణం కాగలదనడంలో సందేహం లేదు.
– కొల్లి ఎన్.రావు, సీనియర్ సలహాదారు, ఐఆర్ఐసీబీఎస్