Take a fresh look at your lifestyle.

‌ప్రగతిశీల సాహిత్య శిఖరం నేల కూలింది

హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీ తెలుగు శాఖలో ఎందరికో నిశ్శబ్దంగా అండగా వుండే ఒక ప్రగతిశీల సాహిత్య శిఖరం నేల కూలింది. మనుషుల్ని కులాలుగా కాక మంచి వాళ్ళుగా చూసేటటువంటి ఒక మంచి మనిషి తన ప్రయాణాన్ని ఈ కరోనా కష్ట కాలంలో అర్ధాంతరంగా ముగించాడు.
ఆయన ఎన్నింటికో ఎందరినో క్షమించాడు. ఈ క్రమంలో క్షమించిన వాళ్లందర్నీ ప్రేమించారు. ప్రగతి శీల భావజాలంతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ ఆయన ముందుకే వెళ్ళారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయన  పరిశోధన దృక్పధాన్ని వదులు కోకుండా ప్రయాణించారు. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి శిష్యుడిగా భాషాశాస్త్రంలో అపారమైన పాండిత్యం ఉన్న కేకే. రంగనాథాచార్యులు సాహిత్య విమర్శలో చారిత్రకత దృక్పథం మీద ప్రత్యేకంగా పరిశోధన చేసి ఎంతోమందికి మార్గదర్శకం అయ్యారు.
ఎందలినో పీజీ రోజుల్లో, ఎంఫిల్‌ ‌రోజుల్లో ఎంతగానో ప్రేమించిన కేకేఆర్‌ ‌మరణం శిష్యులకు తట్టుకోవడం కష్టం. అనేకమందిని  చింతాక్రాంతులు చేసింది. ఆయన మరణం అనేక గుండెలకు భారం అయింది. కేకేఆర్‌ ‌తో చర్చోపచర్చల జ్ఞాపకాలు గుండెల్లో మెదిలి పలువురికి  దుఃఖం కలుగుతున్నది. తెలుగు సాహిత్యం-చారిత్రక భూమిక’  పుస్తకం ఇప్పటికీ ఎప్పుడూ కనిపిస్తూ ఆయన స్పూర్తిని పదిలం చేస్తూ ఉంటుంది. సాహిత్యాన్ని చారిత్రక కోణం నుండి పరిశీలించేలా ఆయన మార్గం నడిపిస్తుంది. డి.డి.కోశాంబి ఆలోచనల నుంచి తెలుగు సాహిత్య చరిత్రను పరిశీలించి నటువంటి రంగనాథాచార్యులు ఆ తర్వాత కాలంలో ఎన్నో మంచి పుస్తకాలు రాసి ఎంతోమంది మేధావులు, సాహిత్య విమర్శకులు తయారుచేశారు.
ఓ రకమైన ప్రేమతో ఆయన మందలింపులు ఇంకా ఒక జ్ఞాపకంగా చాలామందిలో మిగిలి ఉన్నాయి, అలా ఎందరినో గట్టిగా ప్రోత్సహించిన కేకేఆర్‌ అం‌టే ఒక రకమైన ప్రేమ  లోలోపల ఉంటుంది. రావిశాస్త్రి మీద రాసిన అంశాన్ని పరిశీలించిన తర్వాత కాలంలో పలువురి చేత ‘సాహిత్య విమర్శకుడిగా కొడవటిగంటి కుటుంబరావు’   మీద ఎంఫిల్‌ ‌చేయించారాయన. కేవలం సాహిత్య కార్యకర్తగా మాత్రమే  కాక సామాజిక కార్యకర్తగా కూడా ఎదుగుతున్న పలువురిని ‘మీ పోరాట క్షేత్రం విశ్వవిద్యాలయం కంటే బయట సమాజంలో ఎక్కువగా పనికి వస్తుంద’ని చెప్పి  వెన్ను తట్టి ప్రోత్సహించారు. స్కూల్‌ ఆఫ్‌ ‌హ్యూమనిటీస్‌  ‌డీన్‌ ‌గా  ఉన్న కాలంలో ఆయన అనేక సార్లు  ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సాహంతోనే అనేకమంది సాహిత్య సభలు నిర్వహించి  ‘సాహితి-  అధ్యయన వేదిక’  ఏర్పాటు చేయడానికి తోడ్పాటు ఇచ్చారు.
ఆ వేదిక  ద్వారా అప్పట్లో సెంట్రల్‌ ‌యూనివర్సిటీలో అనేక సాహిత్య సభలు జరిగాయి. ఆ రోజుల్లో త్రిపుర నేని శ్రీనివాస్‌  ‌చనిపోయినప్పుడు సంస్మరణ సభలో కేకేఆర్‌ ‌కూడా పాల్గొన్నారు.  హైదరాబాద్‌ ‌యూనివర్సిటీ తెలుగు శాఖలో కేకేఆర్‌  ‌ప్రగతిశీల సాహిత్య శిబిరానికి ఎప్పుడూ వెన్ను దన్నుగా ఉండేవారు.
మంచి పరిశోధకులను నిశ్శబ్దంగా ప్రోత్సహించేవారు. తెలుగు శాఖలో ఆయన ఒంటరివాడు. ఈ ఒంటరితనం ఆయనను బాధ పెట్టినట్టుగా ఎవరికీ అనిపించలేదు. శాఖ ఆచార్యులు అంతా ఒకవైపు ఆయన మరొకవైపు ఉన్నట్టుగా ఉండేది. ఒక్కడయినా సరే  పరిశోధకులని, ప్రగతిశీల సాహిత్య పరిశోధకులని ప్రోత్సహించేవారు. సాహిత్య విమర్శకుడుగా కొడవటిగంటి కుటుంబరావు అనే అంశం సంబంధించిన రిఫరెన్స్ ‌పుస్తకాలు గా యాకూబ్‌ ‌రాసిన ‘సాహిత్య విమర్శకుడి రారా’ పుస్తకాన్ని కూడా  ఆయనపరిచయం చేశారు.
ఆయన ఇంటినిండా పుస్తకాలే. ఒక పెద్ద లైబ్రరీ ఆయన ఇంట్లో ఉండేది. అనేకసార్లు తార్నాకలోని ఆయన ఇంటికి వెళ్ళిన వారిని ఆ లైబ్రరీ  విపరీతంగా ఆకట్టుకునేది. అందులో కూర్చుని ఎప్పుడూ నిశ్శబ్దంగా రాసుకుంటూ ఉండేవారు కేకేఆర్‌. ‌సాధారణ సాహిత్య పాఠకులకు కేకేఆర్‌ ‌వెంటనే అర్థం అయ్యే అవకాశం తక్కువ. కేకేఆర్‌ ‌పుస్తకాలను కూడా ఒకటికి రెండు సార్లు చదివితేనే బాగా అర్థం అవుతాయని నమ్ముతారు.  కేకేఆర్‌ ‌రాసిన ‘బహుముఖ’ వ్యాసాలు ఎమెస్కో ప్రచురించిన పుస్తకాన్ని ఎందరో ప ఆసక్తితో చదివారని గుర్తు.
సాహిత్యాన్ని భౌతికవాద దృక్పధంతో పరిశీలించ డానికి కేకేఆర్‌  ఒక దారి చూపారు. హెచ్‌ ‌సి యూ తెలుగు శాఖలో  ఓవైపు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం సాహిత్య ప్రక్రియ వికాస చరిత్ర దృక్పథంతో సాహిత్య విమర్శను రాస్తూ ఉంటే తెలుగు సాహిత్య విమర్శను చారిత్రక దృక్పథంతో రాయడానికి కేకేఆర్‌ ఒక మార్గం వేశారు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆయన అద్భుత పరిశోధకుడు. నిరంతర సాహిత్య కృషీవలుడు. ప్రగతిశీల సాహిత్య ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉన్న గొప్ప మనిషి. నిరాడంబరంగా జీవిస్తూ కులమతాలకు అతీతంగా మనుషుల్ని ప్రేమించగలిగే కర్మయోగి. విశిష్ట మానవుడు.
అచ్ఛమైన పరిశోధకుడు  ఆచార్య కే రంగనాథాచార్యులు  మృతికి కన్నీటి నివాళి.

– డాక్టర్‌ ‌నూకతోటి రవికుమార్‌
98481 87416

Leave a Reply