- •ం క్వారంటైన్లో పలువురు అధికారులు
- డీజీపీ కార్యాలయంలో ఉద్యోగికి కొరోనా పాజిటివ్
తెలంగాణ పోలీసు విభాగంలో ఇప్పటి వరకు కింది స్థాయి సిబ్బందినే చుట్టేస్తున్న కరోనా వైరస్ ఉన్నతాధికారులకూ వ్యాపిస్తోంది. ఇప్పటికే ఓ ఐపీఎస్ అధికారి వైరస్ బారినపడగా తాజాగా మరో ఇద్దరు ఐపీఎస్లకు పాజిటివ్ వచ్చింది. వీరు నగరం కేంద్రంగా పని చేస్తున్న వారే కావడం గమనార్హం. ఈ పరిణామంతో ఆయా అధికారుల వద్ద పని చేసిన, చేస్తున్న గన్మెన్లు, సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. అలాగే మహిళా ఐపీఎస్ ఉన్నతాధికారి కూడా కరోనా బారినపడ్డారు. మరోవైపు డీజీపీ కార్యాలయంలో సైతం ఉద్యోగికి కరోనా సోకింది. తన వద్ద పనిచేసే సహాయకుడికి కూడా పాజిటివ్ రావడంతో అడిషనల్ డీజీ స్థాయి అధికారి ఒకరు •ం క్వారంటైన్లో ఉన్నారు. ఇక ఒక్క బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే 20 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో వారిని •మ్ ఐసోలేషన్కు తరలించారు.
ఇటీవల రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులు గ్రేటర్ వాసుల కంటిద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక్కడ..అక్కడ..వీరు..వారు అనే తేడా లేకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కరోనా కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. గురువారం 302 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. శుక్రవారం రికార్డు స్థాయిలో 329 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా గ్రేటర్లో ఈ నెలలో ఇప్పటి వరకు 3026 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 116 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఇప్పటికే ఓ ఉద్యోగికి పాజిటివ్ రాగా…తాజాగా జిల్లా అధికారికి కూడా పాజిటివ్ నిర్దారణ అయినట్లు సమాచారం. మరోవైపు కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సూపర్వైజర్ ఆస్పత్రి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. జనగాం జిల్లా, బచ్చన్నపేటకు చెందిన బాలరాజు (55) మల్లాపూర్లో ఉంటూ ఎజిల్ సెక్యూరిటీ సంస్థ తరుపున గాంధీ ఆస్పత్రిలో సెక్యూరిటీ సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైన బాలరాజు ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా కరోనా లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈనెల 17న రాత్రి ఆస్పత్రిలో చేరిన అతను ఐసీయులో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు.
ఎమ్మెల్యే రాజాసింగ్ డ్రైవర్కు కరోనా
ట్విట్టర్లో పేర్కొన్న సింగ్
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులను సైతం కరోనా వణికిస్తోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనాతో ఆస్పత్రిలో చేరారు. కాగా తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కూడా కరోనా భయం పట్టుకుంది. రాజాసింగ్ డ్రైవర్కు కరోనా పోజిటివ్ వచ్చినట్టు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. గన్మెన్కు శుక్రవారం నాడు కరోనా సోకినట్టు తేలిందని, దీంతో తాను కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నానని రాజా సింగ్ వెల్లడించారు. రాజాసింగ్తో పాటు ఆయన కుటుంబీకులు, సన్నిహిత కార్యకర్తలు కూడా టెస్ట్ చేయించుకున్నామని తెలిపారు. టెస్ట్ లకు సంబందించిన రిపోర్ట్లు రెండు రోజుల్లో రావచ్చునని తెలిపారు. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని, ఆయుష్ మంత్రాలయ గైడ్ లైన్స్ పాటించాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను వ్యాయామం చేస్తున్న ఓ వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు.