- పసుపు కండువా కప్పి స్వాగతించిన చంద్రబాబు
- అంచలంచెలుగగా ఎదిగిన నేత కన్నా అని చంద్రబాబు కితాబు
అమరావతి, ఫిబ్రవరి 23 : బిజెపిని వీడిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరులోని తన నివాసం నుంచి అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం.. మధ్యాహ్నం 2.48 గంటలకు చంద్రబాబు సమక్షంలో కన్నా తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు పసుపు కండువా కప్పి.. కన్నా లక్ష్మీనారాయణను పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు టీడీపీ కండువా కప్పుకున్నారు. కన్నా చేరిక సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీలోకి రావడం శుభపరిణామమని అన్నారు. కన్నాను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు.
రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్న వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ అని అన్నారు. విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 నుంచి 2014 వరకు మంత్రిగా సేవలందించారు. రాజకీయాల్లో నిబద్ధత ప్రకారం కన్నా పనిచేశారు. పదవులు ఎప్పుడూ శాశ్వతం కాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చంద్రబాబు కొనియాడారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులు కన్నాకు అపూర్వ స్వాగతం పలికారు. అలాగే గుంటూరు మాజీ మేయర్, కన్నా కుమారుడు నాగరాజు, తాళ్ల వెంకటేశ్ యాదవ్, మాజీ ఎంపీ లాల్జాన్బాషా సోదరుడు, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ఎమ్ నిజాముద్దీన్ తదితరులు టీడీపీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కన్నా అనుచరులు, పలువురు సీనియర్ నాయకులు వేలాది మంది ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.