- కలిసి మెడలు వంచుదాం రండి
- బిజెపి రాష్ట్ర చీఫ్ బండి, పిసిసి చీఫ్ రేవంత్లకు వైఎస్ఆర్టిపి చీఫ్ షర్మిల ఫోన్
- సానుకూలంగా స్పందించిన ఇరు పార్టీల నేతలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1 : సీఎం కేసీఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల అన్నారు. కలిసి పోరాటం చేయక పోతే ప్రతిపక్షాలను తెలంగాణలో కేసీఆర్ బ్రతకనివ్వరని తెలిపారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని ఇరువురు నేతలను షర్మిల కోరారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్దామని చెప్పారు. ప్రగతి భవన్ మార్చ్ పిలుపు నిద్దామని షర్మిల సూచించారు. షర్మిల ఫోన్కాల్పై బండి సంజయ్, రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఉమ్మడిగా పోరాటం చేసేందుకు బండి సంజయ్ మద్దతు తెలిపారు. త్వరలో సమావేశం అవుదామని చెప్పారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని బీజేపీ నేత స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు. కాగా… టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశాన్ని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సీరియస్గా తీసుకున్నారు. లీకేజ్లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే పలుమార్లు షర్మిల పోరాటం చేశారు. రెండు సార్లు షర్మిల పోరాటాన్ని పోలీసులు అడ్డుకోగా..శుక్రవారం మూడో సారి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి చేరుకున్నారు. టీఎస్పీఎస్సీ ముట్టడికి యత్నించిన షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలతో కలిసి నిరుద్యోగుల విషయంలో పోరాడాలని షర్మిల నిర్ణయించారు. ఈ మేరకు బీజేపీ నేత బండిసంజయ్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఫోన్లు చేసి.. కలిసి పోరాడుదామంటూ షర్మిల పిలుపునిచ్చారు. అయితే చివరగా కాంగ్రెస్తో కలసి రాలేమని బండి సంజయ్ మెలిక పెట్టారు. ఎందుకంటే కాంగ్రెస్, బిఆర్ఎస్ కలసి పోతాయని స్పష్టం అయ్యిందన్నారు.