సిద్ధిపేట, సెప్టెంబర్ 25 (ప్రజాతంత్ర బ్యూరో): జిల్లాలో 55 వేల ఎకరాలలో ఆయిల్ ఫాం సాగుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినందున ఆ మేరకు జలాశయాల ఆయకట్టు పరిధిలో ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ ఫాం సాగుకు తక్షణమే ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు ఉద్యానవన అధికారులను ఆదేశించారు. ఆయిల్ ఫాం సాగు పై ఉద్యానవ కమిషనర్ వెంకట్రామ రెడ్డి, జిల్లా కలెక్టర్ పరపతి వెంకట్రామ రెడ్డి, జిల్లా ఉద్యానవన ఉప సంచాలకులు రామలక్ష్మి, ఎంపిపిలు, జడ్పిటిసి, సర్పంచులు, ఎంపిటిసిలు, రైతు బంధు సమితి జిల్లా, మండల, గ్రామ సమన్వయకర్తలు, పెదవేగిలోని జాతీయ అయిల్ ఫాం పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, ఖమ్మం, నల్గొండ ఆయిల్ ఫాం సాగు చేస్తున్న రైతులు మొత్తం 1600 మందితో హరీష్ రావు రెండు గంటల పాటు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
సంప్రదాయ పంటల సాగుతో పోల్చుకుంటే ఆయిల్ ఫాం సాగు వల్ల రైతులకు అధిక ప్రయోజనాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.నాలుగేళ్ల నుండి దిగుబడి ప్రారంభమై 30 ఏళ్ల పాటు ఆయిల్ ఫామ్ దిగుబడి ఇస్తుందన్నారు. అంతర పంటల సాగుకు ఆయిల్ ఫామ్ అనుకూలం అని మంత్రి తెలిపారు. ఎకరా వరికి అవసరమయ్యే నీటితో నాలుగెకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేయొచ్చన్నారు. 20 శాతం కార్బన్ పీల్చుకునే ఆయిల్ ఫామ్ మొక్కలు 22 శాతం ఆక్సిజన్ను విడుదల చేస్తాయన్నారు. పర్యావరణపరంగా, రైతుకు లాభాలు అందించేపరంగా ఆయిల్ ఫామ్సాగు ఎంతో ఉపయోగం అని మంత్రి తెలిపారు. ఆయిల్ ఫాం సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఆయిల్ ఫామ్ పంటకు విపరీతమయిన డిమాండ్ ఉందన్నారు. జిల్లాలో సాగు నీటి సౌకర్యం గణనీయంగా మెరుగైన నేపథ్యంలో రైతులు విస్తృతంగా ఆయిల్ ఫామ్ సాగును చేపట్టేలా ఉద్యానవన అధికారులు, రైతుబంధు సమితి సభ్యులు క్షేత్ర స్థాయిలో పర్యటించి అవగాహన కల్పించాలన్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేయాలన్నారు.